Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్, మారుతి కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'పక్కా కమర్షియల్'. ఈ సినిమా జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ, 'సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాని అందరూ థియేటర్లలో చూడాలనే ఉద్దేశంతో టికెట్ ధరలను తగ్గించాం. మారుతి తనదైన మార్క్తో తెరకెక్కించాడు. భారీ చిత్రాలు వెంటనే ఓటీటీలో విడుదల కావడం వల్ల హీరోల క్రేజ్ తగ్గే అవకాశం ఉంది. ఇటీవల ఓ సినిమా విడుదల విషయంలో ఓ అగ్ర హీరో నిర్మాతతో ఒప్పందం కుదుర్చుకుని, తన అనుమతి లేకుండా 50 రోజుల వరకు ఓటీటీలకు ఇవ్వకూడదని షరతు పెట్టారు. పరాజయం పాలైన సినిమాను త్వరగా ఓటీటీకి ఇవ్వడం వల్ల లాభం కనిపించవచ్చు. కానీ అది భవిష్యత్తులో థియేటర్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సమస్యలపై చర్చించడానికి నిర్మాతలంతా నేడు(బుధవారం) సమావేశం కానున్నారు. కరోనా తర్వాత సినిమా పబ్లిసిటీ ఖర్చులు పెరిగాయి. కలెక్షన్లు తగ్గాయి. ఎంత పెద్ద సినిమా విడుదలైనా 30 నుంచి 40 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుందిలే, అప్పుడు చూద్దాం అనే పరిస్థితి ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. ఆ స్థితి వస్తే ఎవ్వరూ ఏం చేయలేం. ప్రస్తుతం ఆన్లైన్ టికెటింగ్ సమస్యపై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు ఎన్నో సందేహాలున్నాయి. దీనికోసం చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఓ సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందనిపిస్తోంది. థియేటర్లలో విడుదలైన సినిమాలను ఎన్ని రోజులకు ఓటీటీకి ఇవ్వాలనే విషయంపై ఎంతో పరిశోధన జరుగుతోంది. అన్నింటికి పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాం. ఈ పరిష్కారం థియేటర్ వ్యవస్థని మరింత స్ట్రాంగ్గా నిలబెడుతుందనే నమ్మకం ఉంది' అని అన్నారు.