Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్ నటించిన సినిమా తాజా సినిమా 'ది వారియర్'. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదలైంది. సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సందర్భంగా శనివారం చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్ మీట్లో హీరో రామ్ మాట్లాడుతూ, 'సినిమా విడుదల సమయంలో వర్షాలు ఉన్నాయి. అడ్డంకులు చాలా వచ్చాయి. లాస్ట్ మినిట్ డిజిటల్ ప్రింట్స్ వెళ్ళే వరకూ ఏదో ఒకటి వస్తూనే ఉంది. మా టీమ్ అంతా వారియర్స్లా నిలబడ్డారు. చివరిగా రిలీజ్ చేశారు. అదే పెద్ద సక్సెస్ అనుకున్నా. ఇటువంటి సమయంలో ఏ ఇండిస్టీలో అయినా సినిమా విడుదల చేయాలా? వద్దా? అనే సందేహం వస్తుంది. కోవిడ్ వచ్చినా... వర్షాలు వచ్చినా... ఏం వచ్చినా... థియేటర్లకు వస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు సినిమా లవర్స్ అని 'ది వారియర్' మరోసారి ప్రూవ్ చేసింది. వర్షాలు చూసి సినిమా వాయిదా వేయాలా? అనే ఆలోచనలో పడ్డాం. కానీ, మేం గట్టిగా నమ్మాం. ప్రేక్షకులు వస్తారని అనుకున్నాం. ఫస్ట్ డే అదే ప్రూవ్ అయ్యింది. మా నిర్మాతల గురించి చెప్పాలి. అందరూ అనుకుంటున్నట్టు నెక్స్ట్ సినిమా వాళ్ళకు చేస్తున్నాను' అని అన్నారు. 'నాకు చాలా సంతోషంగా ఉంది. నా తొలి తెలుగు చిత్రమిది. రామ్ లాంటి మంచి హీరో, శ్రీనివాసా చిట్టూరి లాంటి నిర్మాత, ఆది పినిశెట్టి, కతి శెట్టి, మంచి టెక్నీషియన్స్ నాకు లభించారు. 'పందెం కోడి', 'ఆవారా', 'రన్' సినిమాలను ఎలా రిసీవ్ చేసుకున్నారో, అలా ఈ సినిమాకు చాలా పెద్ద ఆదరణ లభించింది. ఈ ఎనర్జీతో ఇంకా స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. మీ ప్రేమకు థ్యాంక్స్. తమిళనాడులో కూడా సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది' అని దర్శకుడు లింగుస్వామి తెలిపారు. నాయిక కతి శెట్టి మాట్లాడుతూ, 'రామ్తో నటించడం బావుంది. గురు పాత్రలో ఆది పినిశెట్టిని తప్ప ఇంకొకరిని ఊహించలేం. లింగుస్వామి గారికి థ్యాంక్స్. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం ఇచ్చారు. మా నిర్మాతలతో మళ్ళీ మళ్ళీ పని చేయాలనుందని లింగుస్వామి గారు చెప్పారు. నేనూ అదే అనుకున్నాను. వాళ్ళ నిర్మాణంలో మరో సినిమా చేసే అవకాశం వచ్చింది. మా సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్' అని చెప్పారు. 'ప్రేక్షకులు అందరికీ థ్యాంక్స్. పక్కా కమర్షియల్ సినిమాలో ఏమేం కావాలో అవన్నీ 'ది వారియర్'లో ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. చూసిన వారంతా బావుందని అంటున్నారు. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. వర్షాల్లో సినిమా విడుదలైనా ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. తర్వాత రోజు మరింత పికప్ అయ్యింది. ఇటువంటి మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకి థ్యాంక్స్. అందరూ చెబుతున్నట్టు మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే ఒక ప్రొడక్షన్ హౌస్ ఇది. వాళ్ళతో నా రెండో చిత్రమిది. చాలా ఖర్చు పెట్టి, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు. 'గురు' పాత్ర గురించి అందరూ మాట్లాడుతున్నారంటే దానికి కారణం లింగుస్వామి. కమర్షియల్ సినిమాలకు ఆయన ల్యాండ్ మార్క్' అని ఆది పినిశెట్టి తెలిపారు.