Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మంచి కంటెంట్తో నిజాయితీగా సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరించడమే కాదు జాతీయ అవార్డులు సైతం కచ్చితంగా వస్తాయని మా 'కలర్ఫొటో' సినిమా నిరూపించింది. 'ఆహా' ఓటీటీలో విడుదలైన మా చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించి, పెద్ద సక్సెస్ చేయటం, మా జెన్యూన్ ప్రయత్నానికి జాతీయ అవార్డు రావడం గర్వంగా ఉంది' అని దర్శకుడు సందీప్రాజ్ అన్నారు. 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా 'కలర్ఫొటో' ఎంపికైంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం తన ఆనందాన్ని మీడియాతో షేర్ చేసుకుంది. శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ,'కలర్ ఫోటో సినిమాకు అవార్డు రావడం ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఇది కలర్ ఫోటోకు మాత్రమే కాదు.. ఇది సెలెబ్రేషన్స్ తెలుగు సినిమా. నిజాయితీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్యాషన్, కమిట్మెంట్, హార్డ్ వర్క్తోనే టీం అంతా కలిసి పని చేయడంతోనే ఈ గుర్తింపు వచ్చింది' అని అన్నారు. దర్శకుడు సందీప్రాజ్ మాట్లాడుతూ, 'వాస్తవానికి దగ్గరగా సినిమా తీస్తే అది ఆటో నడుపుకునే వాళ్ల దగ్గర్నుంచి ఢిల్లీలో ఉన్న జ్యూరీ మెంబర్స్ వరకు మెప్పిస్తుందని అర్థమైంది. ఓ మంచి సినిమా చేశామనే సంతృప్తితో ఉన్నాం. మా ప్రయత్నాన్ని, మా చిత్రాన్ని ఆదరించి, ప్రోత్సహించిన అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ సినిమాతో మరింత బాధ్యత పెరిగింది' అని తెలిపారు. 'ఈ సినిమాలో నన్ను హీరోగా నటించమన్నప్పుడు చాలా భయం వేసింది. కథని నమ్మి ఈ సినిమా తీశాం. ప్రేక్షకుల ప్రశంసలతోపాటు జాతీయ అవార్డు రావడం ఆనందంగా ఉంది' అని హీరో సుహాస్ చెప్పారు.'ఈ సినిమా ప్రారంభం నుంచే మేం ఓ మంచి సినిమాలో భాగమయ్యామనే భావనతో ఉన్నాం. జాతీయ అవార్డుతో గుర్తింపు రావడం ఆనందంగా ఉంది' అని నాయిక చాందిని చౌదరి అన్నారు.