Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పెళ్లి చూపులు', 'డియర్ కామ్రేడ్', 'దొరసాని' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ సంస్థ తాజాగా తమ 6వ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించింది. యష్ రంగినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతన్య రావ్, లావణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'ఓ పిట్ట కథ' చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న చెందు ముద్దు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
రామానాయుడు స్టూడియోస్లో శుక్రవారం ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. నిర్మాత సురేష్ బాబు క్లాప్ నివ్వగా, దర్శకులు తరుణ్ భాస్కర్ కెమెరా స్విచ్చాన్ చేసారు. అలాగే మొదటి షాట్కు దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మధుర శ్రీధర్ రెడ్డి, సందీప్ రాజ్, సాయి రాజేష్, తమ్మారెడ్డి భరద్వాజ, శరత్ మరార్, దర్శకుడు కెవిఆర్. మహేంద్ర, మాటల రచయిత లక్ష్మీ భూపాల్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ, 'మా మొదటి సినిమా 'పెళ్లి చూపులు' విడుదలైన తేదీ జూలై 29. అదే రోజున మా కొత్త చిత్రాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. మా సంస్థలో ఆరో సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా గ్రామీణ నేపథ్యంతో సాగుతుంది. దాదాపు అంతా కొత్తవాళ్లే నటిస్తున్న ఈ సినిమాకు కథే స్టార్. చాలా ఫ్రెష్గా ఉండే సబ్జెక్ట్తో దర్శకుడు చెందు ముద్దు తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్ 1 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. అమలాపురం, అరకు ప్రాంతాల్లో దాదాపు నెల రోజులు చిత్రీకరణ చేస్తాం. ఆ తర్వాత సెప్టెంబర్లో కేరళ షెడ్యూల్ ఉంటుంది. అక్టోబర్ కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేసేందుకు ప్రయత్నిస్తాం' అని అన్నారు. 'నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. చెందు ముద్దు చేసిన 'ఓ పిట్ట కథ' సినిమా నాకు బాగా నచ్చింది. నా మనసుకు దగ్గరైన సినిమా అది. ఈ సబ్జెక్ట్ విన్నాక నా కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందనిపించింది. సక్సెస్ మీట్లో మిమ్మల్ని తప్పకుండా కలుస్తాం అనే నమ్మకం కలిగింది. ఈ సినిమాతో ఓ విజయాన్ని ఇచ్చిన నిర్మాతకు, దర్శకుడికి థాంక్స్ చెప్పుకుంటాం' అని హీరో చైతన్య రావ్ చెప్పారు.
హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ, 'పల్లెటూరి నేపథ్యంగా సాగే చిత్రమిది. అన్ని కమర్షియల్ అంశాలు కథలో ఉన్నాయి. చెందు చేసిన 'ఓ పిట్ట కథ' నా ఫేవరేట్ మూవీ. ఈ కథతోనూ ఆయన ఓ మంచి సినిమా చేస్తారని నమ్మకం కలిగింది. ఇందులో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది' అని తెలిపారు.
దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ, 'వినూత్న విలేజ్ బ్యాక్ డ్రాప్ కథ ఇది. మా టీమ్ అంతా దాదాపు కొత్తవాళ్లం. ఒక కొత్త తరహాలో, ప్రయోగాత్మక పద్ధతిలో ఈ సినిమా మేకింగ్, లొకేషన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. ఒక హిట్ సినిమాను మా నిర్మాత యష్ గారికి ఇవ్వబోతున్నాం. ఈ సినిమా తప్పకుండా అందరికీ బాగా నచ్చుతుంది' అని చెప్పారు.
మిహిరా, ఉత్తర, రాఘవ, ఆదిత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - ప్రిన్స్ హెన్రీ, సినిమాటోగ్రఫీ - పంకజ్ తొట్టాడ, ఎడిటర్ - డి వెంకట్ ప్రభు, నిర్మాత - యష్ రంగినేని, రచన దర్శకత్వం - చెందు ముద్దు.