Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో మంచు విష్ణు నటిస్తున్న నూతన చిత్రం 'జిన్నా'. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య దర్శకుడు. భారీ తారాగణం, సాంకేతిక నిపుణులతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది ఈ చిత్రం. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ అందం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానుంది. జి. నాగేశ్వర్ రెడ్డి కథ అందించిన ఈ చిత్రానికి కోన వెంకట్ స్క్రిప్టు అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఈ టీజర్ వేడుక హైదరాబాద్లోని ఏఎంబీ సినిమాస్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్, కోన వెంకట్, అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు. విడుదలైన టీజర్ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ముఖ్యంగా విష్ణు డైలాగ్ డిక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
టీజర్ని బట్టి చూస్తే ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్లా అనిపిస్తున్నప్పటికీ టీజర్ చివరిలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సర్ప్రైజ్ చేస్తున్నాయి. 'ఢ, దేనికైనా రెడీ' తర్వాత విష్ణు కెరీర్లో ఆ స్థాయి విజయాన్ని అందుకోగల సత్తా ఉన్న సినిమా అనే నమ్మకాన్ని టీజర్ కలిగిస్తోంది.
టీజర్ విడుదల సందర్భంగా విష్ణు మాట్లాడుతూ, ''జిన్నా' నా మనసుకి దగ్గరైన సినిమా. ఇందులో ఎన్నో విశేషాలు ఉన్నాయి. నా బంగారు తల్లులు అరియనా, విరియానా పాట పాడారు. వాళ్ళతో పాడించినందుకు బిగ్ థ్యాంక్స్. మా నాన్నగారు కోన వెంకట్ గారిని బాబారు అని పిలిస్తే, నేను మాత్రం బ్రదర్ అని పిలుస్తాను. నా కెరీర్లో నాగేశ్వరరెడ్డి గారికి ప్రత్యేక స్థానముంటుంది. నేను డౌన్లో ఉన్న టైంలో ఆయన నాకు 'దేనికైనా రెడీ'తో సూపర్ హిట్ ఇచ్చారు. ఈ సినిమాలో నా కంటే ముందు సన్నీనే ఫైనల్ చేశారు. కానీ ఇక్కడ సన్నీని ఎలా రిసీవ్ చేసుకుంటారని భయం ఉండేది. కానీ కోన గారు, నాన్నగారు, తెలిసిన మీడియా మిత్రులు సన్నీకే ఓటు వేశారు. 'ఢ' ఇచ్చిన శ్రీను వైట్ల గారి తర్వాత నన్ను అంతలా మెప్పించాడు డైరెక్టర్ సూర్య. అనూప్తో ఎప్పటినుంచో పని చేయాలి అనుకున్నాను. ఈ సినిమాతో కుదిరింది. దేశంలోని గొప్ప సినిమాటోగ్రాఫర్స్లో ఒకరైన చోటా గారితో పని చేయడం గర్వంగా ఉంది' అని తెలిపారు. 'టీజర్ జస్ట్ శాంపిల్.. పిక్చర్ అదిరిపోతుంది. ఈ మూవీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది' అని నాయిక పాయల్ రాజ్ఫుత్ చెప్పారు. మరో నాయిక సన్నీ లియోన్ మాట్లాడుతూ, ' మీ అందరి అభిమానం వల్లే మేం పని చేయగలుగుతున్నాం. మా కాస్ట్ అండ్ క్రూ అంతా కలిసి ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. తప్పకుండా ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుంది' అని అన్నారు. 'ఈ సినిమా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ఇందులో ఎంటర్ టైన్మెంట్తో పాటు ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి' అని డైరెక్టర్ సూర్య చెప్పారు. కోన వెంకట్ మాట్లాడుతూ, 'నేను ఎంటర్ టైన్మెంట్ని నమ్ముకొని ఈ స్థాయికి వచ్చాను. అదే పంథాలో చేసిన 'ఢ, దేనికైనా రెడీ' సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఆ రెండింటిని మించిన బ్లాక్ బస్టర్ ఈ సినిమా అవుతుంది' అని తెలిపారు.