Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ప్రముఖ వ్యాపారవేత్త డి.మధు నిర్మించిన చిత్రం 'పంచతంత్ర కథలు'. నోయెల్, నందిని రారు, సాయి రోనక్, నిహాల్ కోదర్తి, అజరు కతుర్వర్, గీతా భాస్కర్, ప్రణీత పట్నాయక్, సాదియ కీలక పాత్రలు పోషించారు. ఐదు కథల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం ద్వారా గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం 'ఆహా'లో విశేష ఆదరణతో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసించారు. తాజాగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ సినిమా వీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న పంచతంత్ర కథలు చూశాను. దర్శకుడు, కెమెరామెన్ ఒకరే కనుక చాలా అద్భుతమైన చిత్రీకరణ జరిగింది. మంచి, మంచి లొకేషన్స్, మంచి మ్యూజిక్, మంచి మాటలు, మంచి ఆర్ట్ డిపార్ట్మెంట్ కుదిరింది. కులవ్యవస్థ గురించి, ప్రేమకు కులాలు అడ్డురావు అనే అంశాన్ని చాలా సున్నితంగా, ఎక్కువ మెలో డ్రామా లేకుండా చాలా చక్కగా తీశాడు. నటీనటులు కూడా చాలా చక్కగా చేశారు. కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. అహల్య అనే మరో షార్ట్ స్టోరీలో..తన బిడ్డను పోషించుకోవడం కోసం వ్యభిచారిణిగా మారిన అమ్మాయి, పెయింటర్ మధ్య జరిగే ఎపిసోడ్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. హదయానికి హత్తుకునేలా చిన్న చిన్న మాటలతో చాలా చక్కగా చిత్రీకరించాడు దర్శకుడు. తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్గారు ఇద్దరు కొడుకులు ఉండడంతో ఏ ఇంట్లో ఉండాలి అనే విషయం ఎంతో సున్నితంగా, ఎంతో ఆలోచింపజేసే విధంగా తీశారు. నిర్మాత మధుకి ఈ సినిమా మరింత మంచి విజయం సాధించి మునుముందు ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నా. అలాగే దర్శకుడు శేఖర్, మిగతా ఆర్టిస్టులకి కూడా మంచి భవిష్యత్ ఉండాలని ఆశిస్తున్నాను' అని చెప్పారు.