Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గణేష్ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'. వర్ష బొల్లమ్మ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి పెళ్లి నేపథ్యంలోని గీతం ఇటీవల విడుదలైంది.
కథానాయకుడు గణేష్, నాయిక వర్ష బొల్లమ్మతో పాటు రావు రమేష్, నరేష్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, ప్రగతి, సురేఖా వాణి తదితరులు ఈ లిరికల్ వీడియో సాంగ్లో కనిపించారు.
ఈ గీతానికి సాహిత్యాన్ని కె కె అందించగా, మహతి స్వర సాగర్ సంగీతంలో హుషారుగా సాగుతుంది. ఈశ్వర్ పెంటి మాస్టర్ నిర్దేశకత్వంలో రూపొందిన ఈ పాట ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.
'డుం డుం డుం డుం డుం మోగింది మేళం' అంటూ మొదలయ్యే ఈ పాట సందర్భాన్ని దర్శకుడు లక్ష్మణ్ వివరించగానే, మహతి స్వరసాగర్ గారు చాలా అద్భుతమైన మెలోడీ బాణీని స్వర పరిచారు .
''ఇది కథానాయకుడు, నాయికలకి నిశ్చితార్థం జరిగే సందర్భంలో సాగే పాట, నిశ్చితార్థం జరిగిన జంటలు ఈ మధ్య కలిసి షాపింగ్లని, వెడ్డింగ్ కార్డ్ సెలెక్షన్ అనీ చాలా టైం కలిసే గడుపుతున్నారు, ఇక ఫోన్లలో ముచ్చట్లకైతే అంతే ఉండదు, అలాగే ఈ మధ్య ప్రీవెడ్ ఫోటో షూట్లు ఒకటి, రకరకాల లొకేషన్లలో సినిమా సెట్టింగులతో హడావిడి చేస్తున్నారు. ఇవన్నీ పల్లవి చరణాల్లో సరదాగా వివరించటానికి ప్రయత్నం చేశాను. దర్శకుడితో పాటు నిర్మాతలకి అందరికీ నచ్చటంతో ఈ పాటని రికార్డ్ చేసారు సాగర్ గారు. చిన్న పిల్లలతో ఈ పాట పల్లవిని పాడించడంతో ఈ పాటకి మరింత అందం చేకూరింది. ఈ పాట ఇక ముందు అన్ని పెళ్లిళ్లలో, సంగీత్లలో మారు మోగడం ఖాయం. ఈ అవకాశం ఇచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్ వారికి, మహతి స్వర సాగర్ గారికి కృతజ్ఞతలు'' అని గీత రచయిత కె కె తెలిపారు.
దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, 'చిత్ర కథాంశం ప్రకారం నాయక, నాయికల పెళ్లి గీతం ఇది. వీరి నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకూ జరిగే వివిధ వ్యవహారాలు, సందర్భాలు, సన్నివేశాల సమాహారం ఈ పాట. పట్టణం నేపథ్యంలో చిత్రీకరించిన దీనిని రచయిత కెకె ఎంతో చక్కగా రచించారు. ప్రేక్షకుడు కూడా సహజంగా అనుభూతి చెందేలా చిత్రీకరించడం జరిగింది' అని చెప్పారు.
దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.
గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్, సినిమాటోగ్రఫీ: సూర్య, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్ల, సమర్పణ: పి.డి.వి. ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, రచన, దర్శకత్వం: లక్ష్మణ్ కె.కృష్ణ.