Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కొత్తగా మా ప్రయాణం' ఫేమ్ ఈశ్వర్ హీరోగా, నైనా సర్వర్ హీరోయిన్గా 'కథనం' ఫేమ్ నాదెండ్ల రాజేష్ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'సూర్యాపేట జంక్షన్'.
ఈ చిత్రాన్ని యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్.ఎస్.రావు, విష్ణువర్ధన్ నిర్మిస్తున్నారు. రాజీవ్ సాలూరు, గౌర హరి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్, సూర్యపేట, నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఈ సందర్బంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ,'నేను చేసిన 'కొత్తగా మా ప్రయాణం' చిత్రం సక్సెస్ అవ్వడంతో టాలీవుడ్లో నేను సక్సెస్ సాధిస్తాననే నమ్మకం మరింత పెరిగింది. ఆ సినిమా తర్వాత చేస్తున్న రెండవ చిత్రమిది. 'కథనం' చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నాదెళ్ల రాజేష్కి ఈ స్టోరీ చెప్పాను. ఆయనకి కథ నచ్చడంతో రెండు సంవత్సరాల నుండి డెవలప్ చేశాను. ఆ తర్వాత నిర్మాతలు అనిల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్. శ్రీనివాసరావు, విష్ణువర్ధన్ లకు కూడా కథ నచ్చటంతో డిసెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేశాం. మొయినాబాద్లో ఒక ఐటమ్ సాంగ్ కోసం ప్రత్యేకంగా సెట్ వేసి చాలా రిచ్ గా సాంగ్ను చిత్రీకరించాం. ఈ సాంగ్తో షూటింగ్ మొత్తం విజయవంతంగా పూర్తి అయ్యింది. వారం రోజుల్లో ఐటమ్ సాంగ్ రిలీజ్తో పాటు మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నాం' అని అన్నారు.
'మా హీరో ఈశ్వర్ నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. మా హీరో కథకి పూర్తి న్యాయం చేశాడు. కన్నడ, మలయాళం చిత్రాలలో హీరోయిన్గా నటించిన నైనా సర్వర్కి ఇది తెలుగులో మొదటి సినిమా. అయినప్పటికీ చాలా చక్కగా నటించింది. గబ్బర్ సింగ్ ఫేమ్ అభిమన్యు సింగ్ విలన్ రోల్ ఈ సినిమాకు కీలకం. ఇంకా చమ్మక్ చంద్ర, భాషా, లక్ష్మణ్ ఇలా చాలా మంది ఈ సినిమాలో నటించారు. రోషన్ సాలూరి, గౌర హరి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో ఉన్న మూడు పాటలు, ఒక ఐటమ్ సాంగ్ ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తాయి. నిర్మాతలు ఈ సినిమా కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు' అని దర్శకుడు నాదెండ్ల రాజేష్ చెప్పారు.