Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'హరిహర వీర మల్లు'.
సాధారణ చిత్రాలతోనే ఏ హీరోకి సాధ్యంకాని విధంగా అసాధారణమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. మొదటిసారి ఆయన ఇలాంటి భారీ స్థాయి పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నటిస్తున్నారు.
తన అభిమానులతో పాటు తెలుగు, భారతీయ సినీ ప్రేమికుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రాన్ని అందించడానికి ఆయన సిద్ధమవుతున్నారు.
వెండితెరపై అద్భుతం సృష్టించడం కోసం చిత్ర బృందం శక్తికి మించి కష్టపడుతోంది. చిత్రీకరణ నుండి కొంత విరామం తర్వాత రాబోయే షెడ్యూల్లో పాల్గొనే ప్రధాన నటీనటులు, కొంతమంది ముఖ్యమైన సాంకేతిక నిపుణలతో ప్రీ షెడ్యూల్ వర్క్షాప్ నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది.
మునుపెన్నడూ లేని విధంగా భారీస్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి వర్క్షాప్ అనేది ఎంతగానో సహాయపడుతుంది.
చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ ప్రేక్షకులకు ఓ పరిపూర్ణమైన చిత్రాన్ని అందించాలన్న సంకల్పంతో ఈ వర్క్షాప్ని తలపెట్టారు. దసరా నవరాత్రులు సందర్భంగా ఈ రోజు ఉదయం వేకువ జామున సరస్వతి అమ్మవారికి పూజాదికాలు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం చిత్ర బృందం ఈ వర్క్ షాప్కు సమాయత్తమైంది. ఈ వర్క్షాప్ గురించి పవన్ కళ్యాణ్తో దర్శకుడు క్రిష్ చర్చించారు. పవన్ కళ్యాణ్ అంత పెద్ద స్టార్ అయినప్పటికీ షూటింగ్కి వెళ్లే ముందు తాను, తన తోటి నటీనటులు పాత్రల గురించి మరింత అవగాహన పొందేందుకు, స్క్రిప్ట్ గురించి బాగా చర్చించుకోవడానికి ఈ వర్క్షాప్కి అంగీకరించారు. దర్శకుడు క్రిష్, పవన్ కళ్యాణ్ ప్రేక్షకులకు సరికొత్త వెండితెర అనుభూతినిచ్చే విధంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని అందించడానికి అదే స్థాయిలో కష్టపడుతున్నారు. ఈ వర్క్షాప్ ముగిశాక అక్టోబర్ రెండో వారం తర్వాత నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్లో నిర్మాత ఎ.ఎం. రత్నం ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'ఖుషి' వంటి ఆల్ టైం క్లాసిక్ హిట్, 'బంగారం' చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్తో ఎ.ఎం.రత్నం చేస్తున్న చిత్రమిది. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తొలిసారిగా పవన్ కళ్యాణ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి అని చిత్ర బృందం తెలిపింది.