Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం 'స్వాతిముత్యం'. బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దసరా కానుకగా నేడు (బుధవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో గణేష్ మీడియాతో పలు ఆసక్తికర విశేషాలను షేర్ చేసుకున్నారు.
'నేను ఓ మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవ్వాలని ఎదురుచూస్తున్న సమయంలో లక్ష్మణ్ ఈ కథ చెప్పారు. ఈ కథతో వస్తే తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్మి, ఈ కథను సితార వారి దగ్గరకు తీసుకెళ్లగా నాగ వంశీ గారికి కూడా కథ నచ్చింది. ఇది తమ బ్యానర్లో చేస్తే మంచి సినిమా అవుతుందని భావించిన ఆయన ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. 'విక్కీ డోనార్' చిత్రానికి, మీ చిత్రానికి పోలికలు ఉన్నాయా అని చాలా మంది అడుగుతున్నారు. రెండు చిత్రాల కథాంశం మాత్రమే ఒకటి. అయితే ఈ రెండు చిత్రాలకు ఎలాంటి సంబంధం లేదు. సందర్భానుసారం వచ్చే హాస్యం నవ్విస్తుంది. ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా వినోదాన్ని పంచుతుంది. ప్రేక్షకులు చిరునవ్వుతోనే థియేటర్ల నుంచి బయటకు వస్తారు. కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుందీ ఈ చిత్రం. ప్రస్తుతం 'నేను స్టూడెంట్' అనే ఒక థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. ఇప్పటికే చిత్రీకరణ కూడా పూర్తయింది' అని బెల్లంకొండ గణేష్ చెప్పారు.