Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామాయణ ఇతిహాస నేపథ్యంతో ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆదిపురుష్'. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై రికార్డులు తిరగరాస్తుండగా, తాజాగా మీడియా కోసం ఏఎంబి థియేటర్లో వేసిన స్పెషల్ షో అందరినీ అబ్బురపరచింది. ముఖ్యంగా త్రీడీ ఫార్మెట్లో ప్రదర్శించిన టీజర్ సరికొత్త అనుభూతినిచ్చింది.
ఈ సందర్భంగా హీరో ప్రభాస్ మాట్లాడుతూ, 'మొదటిసారి మా టీజర్ని 3డీలో చూస్తూ చిన్నపిల్లాడిలా ఫీల్ అయ్యాను. అభిమానుల కోసం 60 థియేటర్లలో ఈ 3డీ టీజర్ వేస్తున్నాం. ఇది థియేటర్ కోసం తీసిన సినిమా. మీ అందరి అభిమానం, ఆశీస్సులు మాకు కావాలి. రానున్న 10 రోజుల్లో మరింత మంచి కంటెంట్తో మీ ముందుకి వస్తున్నాం' అని అన్నారు. '3డీలో టీజర్ మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. దిల్రాజు ఇక్కడకి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు' అని దర్శకుడు ఓం రౌత్ తెలిపారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ''ఆదిపురుష్' టీజర్ కోసం ఫాన్స్లాగే నేనూ చాలా ఆతృతగా ఎదురు చూశాను. టీజర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇదే విషయాన్ని మా టీమ్తో చెప్పా, కానీ వాళ్ళు నాతో నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయని చెప్పారు. నేను ఒక్కటే చెప్తున్నాను 'బాహుబలి' సినిమాకి కూడా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ అసలు బొమ్మ చూశాకే దాని రేంజ్ అర్థమవుతుంది. ఆ తర్వాత టాక్ అదే వెళ్తుంది' అని చెప్పారు.
'మీ రెస్పాన్స్కి చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ టీజర్ నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా ఇష్టంతో మీ అందరికీ నచ్చేలా చిత్రీకరించాం. ప్రభాస్, ఓం రౌత్ చాలా కష్టపడ్డారు. మీ అందరి ఆశీస్సులు మాకుంటాయని ఆశిస్తున్నాను' అని నిర్మాత భూషణ్ అన్నారు. మరో నిర్మాత రాజేష్ నాయర్ మాట్లాడుతూ, 'జై శ్రీరాం..అదొక్కటే మంత్రం ఇక. ఓం, ప్రభాస్ ఈ చిత్రాన్ని థియేటర్ల కోసమే చేశారు. భక్తితో చేసిన ఈ చిత్రం మీ అందర్నీ మెప్పిస్తుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు. ఆధునాతన సాంకేతికతతో 3డి అనుభూతి ఇవ్వడానికి రూపొందిన ఈ చిత్ర టీజర్ని అభిమానుల కోసం తెలుగు రాష్ట్రాల్లో 60-70 థియేటర్లలో ప్రదర్శించనున్నారు. కృతి సనన్ సీతగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణుడిగా, సన్నీసింగ్ లక్ష్మణుడిగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తుండగా, యూవీ క్రియేషన్స్ భాగస్వామ్యంలో వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.