Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధ్యప్రదేశ్లో పర్యాటక రంగాన్ని (టూరిజం) ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ ఓ మహత్తర అవకాశాన్ని ప్రకటించింది. తమ రాష్ట్రంలో కనీసం యాభై శాతం షూటింగ్ (ఇండోర్/ఔట్ డోర్) జరుపుకునే చిత్రాలకు గరిష్టంగా కోటిన్నర నుంచి రెండు కోట్లు వరకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.
అక్కడ ప్రభుత్వ లొకేషన్లకు చెల్లించే సొమ్ములో 75 శాతం సైతం వెనక్కి ఇస్తోంది. అంతేకాదు, ఆ రాష్ట్రం నలుమూలలా ఇబ్బందులు లేకుండా షూటింగ్ చేసుకునేందుకు అనుమతులు చాలా సులభంగా లభించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ విషయాలను వెల్లడించేందుకు మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఉమాకాంత్ చౌదరి తన సిబ్బందితో సహా హైదరాబాద్ విచ్చేశారు. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవచ్చని ఆయన ప్రకటించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, 'షూటింగ్ పర్మిషన్స్ జారీ చేయడం మొదలుకుని, నిర్ణీత వ్యవధిలో రాయితీ అందించడం వరకు ప్రతి ఒక్కటీ పారదర్శకంగా ఉంటుంది. దేశంలో మరెక్కడా లేని మధ్యప్రదేశ్లో ఉన్న అద్భుత సందర్శనీయ ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేయడం ఈ ప్రోత్సాహకాల ముఖ్య ఉద్దేశ్యం' అని చెప్పారు. మధ్యప్రదేశ్ పర్యాటక సంస్థ కల్పిస్తున్న ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకుని, 'తప్పించుకోలేరు' చిత్రాన్ని తెరకెక్కించి, సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారి నగదు ప్రోత్సాహకం అందుకున్న దర్శక, నిర్మాత రుద్రాపట్ల వేణుగోపాల్ తన అనుభవాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు. అలాగే తన రెండో చిత్రం మధ్యప్రదేశ్లోని పలు అద్భుత లోకేషన్స్లో త్వరలోనే ప్రారంభం కానుందని ఆయన తెలిపారు.
నిర్మాతలు ఆచంట గోపీనాథ్, బెక్కెం వేణుగోపాల్, డి.ఎస్.రావు, టి.రామసత్యనారాయణ, దర్శకులు చందా గోవింద్ రెడ్డి, గౌతమ్ రాచిరాజు, రైటర్ రవిప్రకాష్ తదితరులను రుద్రాపట్ల వేణుగోపాల్ మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఉమాకాంత్ చౌదరికి పరిచయం చేశారు.