Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆటగదరా శివ', 'మిస్ మ్యాచ్', 'క్షణ క్షణం' వంటి చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఉదయ్ శంకర్. ఆయన నటించిన కొత్త సినిమా 'నచ్చింది గర్ల్ఫ్రెండూ'. ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆర్ట్స్ పతాకంపై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మించారు. గురు పవన్ దర్శకుడు.
ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఉదయ్ శంకర్ మీడియాతో ముచ్చటించారు.
దర్శకుడు గురు పవన్ నాకు మంచి మిత్రుడు. థ్రిల్లర్తో సాగే ఒక మంచి లవ్ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించాడు.
సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్య 12 గంటల్లో జరిగే కథ ఇది. దేశ భద్రతకు సంబంధించిన ఒక సోషల్ ఇష్యూని కూడా ఇందులో చర్చించాం. ఈ చిత్రంలో రాజారాం అనే పాత్రలో నటించాను. అతనో అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆమె వెంట పడతాడు. వీళ్ల ప్రేమ కథ ఇలా సాగుతుంటే...వాళ్లిద్దరికీ తెలియని ఓ ప్రమాదం వారిని వెంటాడుతుంటుంది. అది ప్రేక్షకులకు తెలుస్తుంది. నాయిక పాత్రలో జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ బాగా నటించింది.
ఈ సినిమాలో 'ఇఫ్ ఐ డై' అనే ఒక యాప్ గురించి చూపించాం. యుద్ధ సమయంలో సైనికులు తాము చనిపోతున్న పరిస్థితుల్లో దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలని లేదా ముఖ్య విషయాలను ఉన్నతాధికారులకు, నాయకులు పంపించేలా ఒక వాచ్ డిజైన్ చేశారు. ఆ వాచ్లో ఈ యాప్ ఉంటుంది. ఇది నిజంగానే ప్రయోగ దశలో ఉన్న యాప్. మరో రెండు మూడేళ్లలో ఇది అందుబాటులోకి రానొచ్చు. ఈ యాప్ నేపథ్యంగానే కథ సాగుతుంటుంది. ద్వితీయార్థంలో అనేక మలుపులు వస్తాయి. ప్రతి సీన్ మరో దానితో కనెక్ట్ అయి ఉంటుంది. ఒక్కటి చూడకున్నా ...ఇక్కడ ఏం జరిగింది అని అనిపిస్తుంటుంది. షేర్ మార్కెట్ గురించిన పాత్రలు, సన్నివేశాలుంటాయి.
తెలుగులో అడివి శేష్, బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానాలా వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ పేరు తెచ్చుకోవాలని ఉంది. నటుడు మధునందన్ సోదరుడు మోహన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా. సంక్రాంతికి ఆ చిత్రాన్ని ప్రారంభిస్తాం. ఈ సినిమా కూడా థ్రిల్లర్తో కూడిన ప్రేమకథగా ఉంటుంది.