Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మళ్లీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' వంటి విజయవంతమైన బ్లాక్బస్టర్ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందిన మూడో చిత్రం 'మసూద'. హర్రర్ డ్రామా ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ,' 'రాహుల్ యాదవ్ ఇంతకు ముందు తీసిన రెండు సినిమాలకు నేను అభిమానిని. 'మళ్లీరావా'తో గౌతమ్ని పరిచయం చేశాడు. తర్వాత 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో స్వరూప్ని డైరెక్టర్గా, నవీన్ పోలిశెట్టిని హీరోగా పరిచయం చేశాడు. నవీన్కి ఆ సినిమా ఎంత ప్లస్ అయ్యిందో తెలిసిందే. రాహుల్ అభిరుచిగల నిర్మాత. ఆ రెండు సినిమాల జర్నీ నాకు నచ్చి.. అప్పుడే రాహుల్కి మాటిచ్చాను. తర్వాత ఏదైనా సినిమా ఉంటే.. నువ్వు నిర్మించిన తర్వాత మా ద్వారా రిలీజ్ చేద్దాం అని చెప్పాను. అందుకే ఈ చిత్రాన్ని మా ఎస్విసి ద్వారా రిలీజ్ చేయబోతున్నాం. ఈ సినిమా టీజర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్గా, ఎగ్టైటింగ్గా అనిపించింది' అని అన్నారు.
'దిల్ రాజుకి థ్యాంక్స్. ఆయనది చాలా మంచి చెయ్యి.. నాది కూడా మంచి చెయ్యి.. రెండు మంచి చేతులు కలిస్తే గట్టిగా సౌండ్ వస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమా విషయానికి వస్తే, 3 సంవత్సరాల కష్టమిది. మధ్యలో కోవిడ్ రావడంతో ఆలస్యమైంది. అందరూ నాకు అండగా నిలబడ్డారు కాబట్టే, ఇంత మంచి సినిమా తీయగలిగాను. మంచి సినిమా అని ఎందుకు అంటున్నా నంటే.. ఇంతకు ముందు నేను తీసిన రెండు సినిమాల విషయంలో నా టేస్ట్ ప్రేక్షకులకి నచ్చింది. ఆ నమ్మకంతో ఇది కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. దిల్రాజు నమ్మకం నిలబెట్టుకుంటాననే హోప్ అయితే నాకుంది. బుధవారం సోనీ మ్యూజిక్ ద్వారా ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేయబోతున్నాం' అని నిర్మాత రాహూల్ యాదవ్ నక్కా తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో తిరువీర్, హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, సంగీత దర్శకుడు ప్రశాంత్, సినిమాటోగ్రాఫర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.