Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళ అగ్ర కథానాయకుడు ధనుష్ నటించిన ద్విభాషా చిత్రం 'సార్'(వాతి). ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించింది.
శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటించింది.
భారీ అంచనాలతో శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. గురువారం సాయంత్రం ప్రదర్శించిన ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు, విశ్లేషకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండటంతో తాజాగా చిత్ర బృందం విలేకర్ల సమావేశం నిర్వహించి, తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, ''చాలా ఆనందంగా ఉంది. నాకు సంవత్సరం తర్వాత డిస్ట్రిబ్యూటర్ల నుంచి హౌస్ ఫుల్ అని ఫోన్లు వస్తున్నాయి. నిన్న ప్రీమియర్లకు మంచి టాక్ రావడంతో.. చిన్న చిన్న ఏరియాలలో కూడా మార్నింగ్ షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. ప్రతి షోకి వసూళ్ళు పెరుగుతున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన 'భీమ్లా నాయక్, డీజే టిల్లు' సినిమాలకు హౌస్ ఫుల్స్ అని ఫోన్లు వచ్చాయి. మళ్ళీ సంవత్సరం తర్వాత ఇప్పుడు ఈ సినిమాకు అంత మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. మొదట ఒకట్రెండు ప్రీమియర్లు అనుకున్నాం. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో షోలు పెంచుకుంటూ పోయాం. ఒక్క హైదరాబాద్లోనే 25 ప్రీమియర్ షోలు వేశాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కలిపి మొత్తం 40 షోలు వేశాం. ధనుష్ 'రఘువరన్ బి.టెక్' తెలుగులో టోటల్ రన్ మీద ఎంత వసూలు చేసిందో ఆ మొత్తం ఒక్కరోజులోనే ఈ చిత్రానికి వస్తాయి. తమిళ్లో కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఓవరాల్గా ధనుష్ కెరీర్లో రికార్డు స్థాయి వసూళ్ళు వచ్చే అవకాశముంది' అని అన్నారు.
'2018 లో వచ్చిన నా మొదటి సినిమా 'తొలిప్రేమ' తర్వాత మళ్ళీ ఇప్పుడే అందరి నుంచి ఫోన్లు వస్తున్నాయి. విడుదలకు ముందు నిద్ర కూడా సరిగా పట్టేది కాదు. కానీ ప్రీమియర్లకు వచ్చిన స్పందన చూశాక ప్రశాంతంగా నిద్రపోయాను. ఉదయాన్నే చెన్నై వెళ్లి మార్నింగ్ షో కూడా చూసొచ్చాను. నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. చివరి 15 నిమిషాలు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. నేను భాగమైన సినిమాకి ప్రేక్షకుల నుంచి ఇంతమంచి స్పందన రావడం గర్వంగా ఉంది. ఈ ఆలోచనను ముందుకు తీసుకు వెళ్లిన వంశీకి ధన్యవాదాలు. ఆయన చెప్పినట్లుగా ముందు రెండు ప్రీమియర్లు అనుకున్నాం.. కానీ అవి పెరుగుతూ 40 షోల వరకు వెళ్లాయి. ఈ 40 షోలకు వచ్చిన స్పందనతో తమిళ్లో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఓ మంచి సినిమాని ప్రేక్షకులకు అందించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ధనుష్, సంయుక్తా మీనన్, నాగవంశీ, చినబాబు (సూర్యదేవర రాధాకృష్ణ), త్రివిక్రమ్గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అని దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పారు.