Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'చిన్న సినిమా కోసం ఐదో షోకు అనుమతినిస్తూ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి అధికారికంగా ప్రకటించడం హర్షించదగ్గ విషయం. చిన్న సినిమా కోసం కేటాయించిన ఐదో షోను సైతం పెద్ద సినిమాలే ఆక్రమించుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో నిఘా అవసరం' అని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్(ఆర్కేగౌడ్). మంగళవారం హైదరాబాద్లోని తమ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆర్కేగౌడ్ మాట్లాడుతూ, 'ఇండిస్టీలో నెలకొన్న సమస్యలపై అధ్యయనం కోసం కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్, తలసాని శ్రీనివాస్యాదవ్లతో కూడిన కమిటీని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఐదో షో, మినిథియేటర్లు, లీజు విధానం, డిజిటల్ విధానాలకు సంబంధించిన సమస్యలను కమిటీ దృష్టికి తీసుకొచ్చాం. ఇటీవల ఐదో షోకు అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు కమిటీకి, సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దసరా తర్వాత ఐదో షో అమల్లోకి వస్తుంది. అలాగే సింగిల్ విండో విధానం ప్రకారం అన్ని సినిమాలకు అనుమతులు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. దీంతోపాటు ఆర్టీసీ బస్టాండ్లలో మిని థియేటర్ల ఏర్పాటు, థియేటర్ల లీజు విధానం రద్దు, నిర్మాతలకు శాపంగా మారిన డిజిటల్ రేంట్ల విధానం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇవి పరిష్కరిస్తే తెలుగు చిత్ర పరిశ్రమకు మేలు చేకూరుతుంది. తెలంగాణ ప్రభుత్వంలాగే ఏపీ ప్రభుత్వం కూడా ఐదో షోకు అనుమతినివ్వాలని కోరుతున్నాం' అని అన్నారు. 'చిన్న సినిమాల కోసం తీసుకొచ్చిన ఐదో షో ప్రైమ్ టైమ్లో ఇవ్వాలని కోరుతున్నాం. అదే సమయంలో ఐదో షోకు చిన్న సినిమాలు లేవని పెద్ద సినిమాలనే ప్రదర్శించే అవకాశం ఉంది. దీంతో చిన్న సినిమాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వంతో నిఘా ఉంచాలి. మేం కూడా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తరపున నిఘా పెడతాం. చిన్న సినిమాలకు ట్యాక్స్ ప్రీతోపాటు సబ్సిడీలు కల్పించాలి' అని సాయి వెంకట్ తెలిపారు.