Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయెల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. ఆ విశేషాలను నిర్మాత శిరీషా శ్రీధర్ తెలియజేస్తూ, 'మా బ్యానర్లో స్టయిలీష్స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ చిత్రమిది. ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యింది. ప్రస్తుతం ఊటీలో చిత్రీకరణ జరుపుతున్నాం. సినిమాలోని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నాం. అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్గా, బాలీవుడ్ నటుడు బోమన్ ఇరాని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అత్యంత భారీ తారాగణం, సాంకేతిక నిపుణులతో సినిమాను రాజీపడకుండా చిత్రీకరిస్తున్నాం. ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పట్నుంచి అందరిలోనూ ఓ ఆసక్తి నెలకొంది. ఎప్పటికప్పుడు కొత్త చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని అనూహ్యంగా పొందిన స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి మరో కొత్త చిత్రం రానుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. వారి అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రాజీపడకుండా నిర్మిస్తున్నాం. ముందుగా ప్రకటించినట్టుగానే ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుదల చేస్తాం. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్-శేఖర్ ఈ చిత్రానికి వినసొంపైన బాణీలను అందిస్తున్నారు. అందరిని అలరించేలా ఈ సినిమా ఉంటుంది' అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు.