Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏపీ ప్రభుత్వం అవార్డులన్నీ వారి చుట్టాలకు, స్నేహితులకు మాత్రమే ఇస్తుంది. కాబట్టి వెంటనే 2012 అవార్డు కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని ఏర్పాటు చేసి, మంచి సినిమాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి' అని 'హార్మోన్స్' చిత్ర దర్శక, నిర్మాతలు డిమాండ్ చేశారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై పలు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), గుణశేఖర్ వంటి తదితరులు అవార్డులపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో 2012లో రూపొందించిన 'హార్మోన్స్' చిత్ర యూనిట్ ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా నిర్మాత ఎన్.ఎస్.నాయక్ మాట్లాడుతూ, 'రైతు, వైద్యం, విద్యుత్ అనే మూడు పాయింట్లను ఆధారంగా చేసుకుని దర్శకుడు ఆనంద్ సామాజిక దృక్పథంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2012 అవార్డులకు జాతీయ సమగ్రత చిత్రాల కేటగిరిలో పదివేల రూపాయలు చెల్లించి దరఖాస్తు చేశాం. కానీ మా సినిమాను పాతాళానికి తొక్కేశారు. సినిమా ఇండిస్టీలో ఉన్న పెద్ద వాళ్ళంతా పదువుల్లో కొనసాగుతారు. కానీ అన్యాయం జరిగితే మాత్రం ప్రశ్నించడానికి ఒక్కరు రారు. చిత్ర పరిశ్రమ గురించి బయట నీచంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని పాత కమిటీని రద్దు చేయాలి' అని అన్నారు.
'గ్రామాల దత్తత కాన్సెప్ట్తో రూపొందిన ఈ చిత్రాన్ని చిరంజీవి చూసి అభినందించారు. ఆయన నటించిన 'పునాది రాళ్ళు' సినిమాలా బాగా ఉందని మెచ్చుకున్నారు. కానీ మా చిత్రాన్ని జ్యూరీ కమిటీ చైర్మెన్ కనీసం చూసిన పాపాన పోలేదు. జ్యూరీ సభ్యులు కూడా చూసి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాన్ని పక్కా అధారాలతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. మాకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి. మాలాంటి వారికి ఎంతో ప్రోత్సాహాన్నిచ్చే అవార్డులు దక్కకపోవడం బాధగా ఉంది' అని దర్శకుడు ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు.