Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీజర్ ఆవిష్కరణలో త్రివిక్రమ్
'మొదటి సినిమాను నిర్మించడం పెద్ద అవస్థ. ఆ అవస్థను నేను కూడా అనుభవించాను' అని అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. నాగశౌర్య, రష్మిక మండన్నా హీరో, హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ ముప్పలూరి సమర్పణలో ఉషా ముప్పలూరి నిర్మిస్తున్న చిత్రం 'ఛలో'. ఈ చిత్ర టీజర్ లాంచ్ శనివారం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో వైభవంగా జరిగింది. అతిథిగా విచ్చేసిన దర్శకుడు త్రివిక్రమ్ టీజర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నా దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన వారిలో వెంకట్ ఒకడు. నాకిష్టమైన వ్యక్తి. తన ప్రయాణంలో నేను కూడా ఒక మజిలీ. నా మజిలీ తర్వాత తను సినిమా డైరెక్ట్ చేస్తుండటం నాకు ఆనందాన్నిచ్చే విషయం. నాకు సినిమా తప్ప వేరే విషయాలు తెలియవు. సినిమా పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు. అది రాజమౌళి అయినా, అవసరాల శ్రీనివాస్ అయినా సినిమా గురించే మాట్లాడతాను. సాయి కొర్రపాటి బ్యానర్తో నాగశౌర్య మొదలు పెట్టిన ప్రయాణం తన సొంత బ్యానర్ వరకు వచ్చింది. సొంత బ్యానర్లో మరిన్ని సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. కొత్త బ్యానర్లో సినిమా చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే నేను చేసిన 'స్వయంవరం' అనే సినిమాకు చాలా కష్టాలు పడ్డాను. సినిమా తీయడం పెద్ద అవస్థ. అలాగే ఏదైన మొదలు పెట్టడం కూడా పెద్ద అవస్థే. ఆ అవస్థను ఈ చిత్ర యూనిట్ అధిగమించిందని నమ్ముతున్నా. సినిమా పెద్ద విజయం సాధించాలి. దర్శకుడు వెంకట్, చిత్ర బృందానికి అభినందనలు' అని అన్నారు.
'త్రివిక్రమ్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన చేతుల మీదుగా టీజర్ విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన బ్యానర్లో ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారో, నా బ్యానర్లో కూడా అలాంటి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తా. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. అన్ని అంశాల సమాహారంగా ఉంటుంది. సినిమా బాగా రావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని హీరో నాగశౌర్య తెలిపారు. దర్శకుడు వెంకీ కుడుముల చెబుతూ, 'తెలుగు సినిమా ఇండిస్టీని ఓ యూనివర్సిటీలా భావిస్తే అందులో త్రివిక్రమ్ అత్యున్నత స్థానంలో ఉన్న ప్రొఫెసర్గా అనుకుంటాను. అటువంటి దర్శకుడి దగ్గర పనిచేయడం గర్వంగా ఫీలవుతాను. ఆంధ్ర, తమిళనాడు బార్డర్లో జరిగే కాలేజ్ లవ్స్టోరీ ఇది. రెండు రాష్ట్రాల వాళ్ళు నిత్యం తమకు తాము కట్టుబాట్లు గీసుకుని గొడవలకు దిగుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి తిరుపురం వెళ్ళిన ఓ కుర్రాడు ఏం చేశాడనేది ఆసక్తికరం. నాగశౌర్యకు నటుడిగా మంచి పేరు తెచ్చి పెట్టే చిత్రమిది. రష్మిక మండన్నా చాలా బాగా నటించింది. నిర్మాతల సహకారం మరువలేనిది. ఏ విషయంలోనూ రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడిగా నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు' అని చెప్పారు. 'నేను కన్నడలో 'కిరాక్ పార్టీ' చిత్రంలో నటించాను. తెలుగులో నటిస్తున్న తొలి చిత్రమిది. నాపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు థ్యాంక్స్. నాగశౌర్యతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఇందులోని మంచి పాత్రతో ప్రేక్షకులను మెప్పిస్తాను' అని హీరోయిన్ రష్మిక మండన్నా అన్నారు.