Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మహానుభావుడు' వంటి సూపర్ హిట్ తర్వాత శర్వానంద్ తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ పతాకంపై ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. హీరో శర్వానంద్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దిల్రాజు క్లాప్ నివ్వగా, రాజు సుందరం మాస్టర్ కెమెరా స్విచాన్ చేశారు. సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ దర్శక,నిర్మాతలకు స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ, 'వైవిధ్యమైన కథాంశంతో ప్యూర్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రేమే ప్రధానంగా ఉంటుంది. ఇందులో శర్వానంద్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. జనవరి 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపనున్నాం. శర్వానంద్ సరసన నటించే కథానాయిక, ఇతర ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం' అని అన్నారు.
'మా చిత్ర ప్రారంభోత్సవానికి పరిశ్రమ పెద్దలు విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. హను రాఘవపూడి మరో విభిన్నమైన కథను తెరకెక్కించబోతున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం' అని నిర్మాతలు అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర, వై.రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్.