Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలపై అందరిలోనూ క్రేజ్ ఉంటుంది. చరిత్రలో ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సంచలనాత్మకమైన సామాజిక, రాజకీయ పరమైన విషయాలతో పాటు నాటి చారిత్రాత్మక సంఘటనలను వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు సైతం అమితాసక్తితో ఉంటారు. చరిత్ర ఆధారంగా గతంలోనూ పలు చిత్రాలు రూపొంది ప్రేక్షక హృదయాలను గెలిచాయి. కమర్షియల్ సినిమాల హవా సాగుతున్న ప్రస్తుత నేపథ్యంలో మరుగున పడిపోయిన చరిత్రను కొంతమంది దర్శక, నిర్మాతలు వెండితెరపై ఆవిష్కరించేందుకు కృషి చేస్తున్నారు.
ఆ ప్రయత్నంలో భాగంగానే చరిత్రతో సమ్మిళితమైన 'రుద్రమదేవి', 'గౌతమిపుత్రశాతకర్ణి', 'ఘాజి', 'బాజీరావు మస్తానీ' వంటి తదితర చిత్రాలు ప్రేక్షకుల విశేష ఆదరణతో అద్భుతమైన విజయాలను నమోదు చేసుకున్నాయి. గత చరిత్ర ప్రధాన ఇతివృత్తంగా
భారీ బడ్జెట్తో ప్రస్తుతం దాదాపు ఐదారు చిత్రాలు రూపొందుతున్నాయి. ఇందులో 'సైరా నరసింహారెడ్డి', '1945', 'పద్మావత్', 'మణికర్ణిక', 'సంఘమిత్ర'
వంటి చిత్రాలున్నాయి.
1857నాటి మొదటి భారత స్వాతంత్య్ర సంగ్రామానికి పదేండ్ల ముందు జరిగిన సంఘటనతో 'సైరా నరసింహారెడ్డి' తెరకెక్కుతోంది. బ్రిటీష్ దుష్టపాలనను ఎదురించి రాయలసీమకు చెందిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన తిరుగుబాటే ఈ కథ. 1846 జూన్ నుంచి 1847 ఫిబ్రవరి వరకు తను చనిపోయేంత వరకు నరసింహారెడ్డి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేశారు. చరిత్ర పరంగా అణచివేయబడ్డ, ఇప్పటి వరకు బయటకు రాని ఈయన చరిత్రను 'సైరా నరసింహారెడ్డి' చిత్రం ద్వారా నేటి తరానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ పదేండ్లుగా ఈయన చరిత్రను స్టడీ చేసి, స్క్రిప్ట్ రెడీ చేశారు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రానికి సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. ఆయనకిది 151వ చిత్రం కావడం విశేషం. అందుకే దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారాయన. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై రామచరణ్ దాదాపు 150కోట్ల బడ్జెట్తో, అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లతో విజువల్ వండర్గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, విజరు సేతుపతి, జగపతిబాబు, సుదీప్, నయనతార వంటి భారీ తారాగణం నటిస్తుండటంతో సినిమాపై అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
హిందీలో తెరకెక్కుతున్న 'పద్మావత్' చిత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 13-14వ శతాబ్దం మధ్యలో జరిగిన కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 1303లో చిత్తోర్గఢ్ సామ్రాజ్యం కోసం రాణి పద్మావతి, మహారావల్ రతన్ సింగ్తో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ యుద్ధం చేసి సామ్రాజ్యాన్ని దక్కించుకునే ఇతివృత్తంతో దర్శకుడు సంజరులీలా భన్సాలీ ఈ సినిమాను తెరపై ఆవిష్కరించారు. రాణి పద్మిని వీరత్వం ప్రధానంగా ఈ చిత్ర కథ సాగుతుందట. భన్సాలీ మార్క్ విజువల్ వండర్గా రూపొందుతున్న ఈ సినిమాలో పద్మావతి పాత్రలో దీపికా పదుకొనె, ఆమె భర్త మహారావల్ రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్, అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు విజువల్ పీస్ట్గా నిలవడంతోపాటు అందరి ప్రశంసలందుకుంది. సినిమాపై మరింత అంచనాలను పెంచింది. పలు వివాదాల కారణంగా ఈనెల 25న ఈ చిత్రం విడుదలవుతోంది.
చరిత్ర నేపథ్యంలో రూపొందుతున్న బాలీవుడ్ చిత్రాల్లో 'మణికర్ణిక' ఒకటి. గతేడాది 'గౌతమిపుత్ర శాతకర్ణి' వంటి చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన క్రిష్ దర్శకత్వంలో ఝాన్సీ రాణి లక్ష్మీ భాయి పోరాట చరిత్ర ఆధారంగా హిందీలో 'మణికర్ణిక' సినిమా రూపొందుతోంది. పుట్టుకతో మణికర్ణికగా పిలవబడే లక్ష్మీ భాయి.. ఝాన్సీ పట్టాణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్ను వివాహం చేసుకున్న తర్వాత తన పేరు లక్ష్మీభాయిగా మార్చబడింది. అనారోగ్యంతో రాజైన తన భర్త చనిపోయిన తర్వాత, బ్రిటీష్ వారికి ఉన్న అప్పు నిమిత్తం రాజ్యాన్ని వదిలి వెళ్ళమని ఝాన్సీని బ్రిటీష్ వారు ఆదేశించారు. దీనికి సమ్మతించని లక్ష్మీభాయి 1857లో తిరుగుబాటు చేశారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఝాన్సీ రాణి లక్ష్మీ భాయి చేసిన వీరోచితమైన పోరాట ఇతివృత్తాన్ని దర్శకుడు క్రిష్ అద్భుతమైన కథగా మలిచి 'మణికర్ణిక-ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో లక్ష్మీభాయి పాత్రలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాదిలో వేసవిలో విడుదల కానుంది.
అలాగే అశోక చక్రవర్తి తనయ సంఘమిత్ర జీవిత చరిత్ర ఆధారంగా 'సంఘమిత్ర' పేరుతో తమిళ దర్శకుడు సుందర్.సి మరో హిస్టరీ బేస్డ్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. క్రీ.పు.250-క్రీ.పు.210 మధ్య కాలంలో సంఘమిత్ర శ్రీలంకకు వెళ్ళి అక్కడ బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడమే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. ఈ సందర్భంగా ఆమె ఎదుర్కొన్న సవాళ్ళను ప్రధానంగా చేసుకుని సుందర్.సి ఈ చిత్రాన్ని ఓ విజువల్ ఎపిక్గా తెరపై ఆవిష్కరించబోతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీలో రూపొందించబోతున్నారు. గతేడాది కేన్స్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫేస్టివల్లో ఈ చిత్ర పోస్టర్ను విడుదల చేశారు. 250కోట్ల బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ సినిమాలో జయం రవి, ఆర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దిశాపటాని సంఘమిత్రగా ప్రధాన భూమికను పోషించే అవకాశాలున్నాయి.
దక్షిణాదిలో రాబోతున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం 'రాండమూజమ్'. మహాభారతం ఆధారంగా ఈ ఎపిక్ డ్రామా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మోహన్లాల్ భీముడిగా నటిస్తున ఈ చిత్రాన్ని దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో నిర్మించేందుకు ప్లాన్ చేశారట. ప్రస్తుతం అమీర్ ఖాన్ నటిస్తున్న 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' సైతం పీరియడ్ డ్రామాగా రూపొందుతోంది. 1830 టైమ్లో 'థగ్స్' అనే కొందరు బందిపోటు దొంగల గ్రూప్ ఇండియా మొత్తం తిరుగుతుంటారు. ఈ క్రమంలో బ్రిటీష్ సైన్యానికి వ్యతిరేకంగా ఈ గ్రూప్ పోరాడింది. ఈ అంశాన్ని ఫిలిప్ మీడోవ్స్ టైలర్ 1839లో 'కన్ఫెషన్స్ ఆఫ్ ఏ థగ్స్' పేరుతో నవలను రాశారు. ఆ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు విజరు క్రిష్ణ ఆచార్య రూపొందిస్తున్నారు. అమీర్ ఖాన్తోపాటు అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది నవంబర్లో విడుదల కానుంది. దాదాపు 200కోట్లతో తెరకెక్కుతోందీ చిత్రం.
వీటితోపాటు యుద్ధ వీరుడు, భారతీయ సుబేదర్ తానాజీ మలుషేర్ కథ ఆధారంగా 'తానాజీ' చిత్రాన్ని రూపొందించనున్నట్టు గతంలో ప్రకటించారు. అజరు దేవగన్ ఇందులో తానాజీగా నటించే ఛాన్స్ ఉంది. అలాగే ఛత్రపతి శివాజీ కథ ఆధారంగా 'శివాజీ', సరగర్హి యుద్ధ కథ ఆధారంగా 'సన్ ఆఫ్ సర్దార్ 2' చిత్రాలు సైతం బాలీవుడ్లో తెరకెక్కే అవకాశాలున్నాయి.
స్వాతంత్రోద్యమ కాలంలో చోటు చేసుకున్న మరో సంఘటన ఆధారంగా '1945' అనే సినిమా రూపొందుతోంది. 1945లో బ్రిటీష్కి వ్యతిరేకంగా పోరాడ్డం కోసం సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సైనిక బృందం ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో సైనిక బృందంలోని ఓ పవర్ఫుల్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ పాత్రలో రానా కనిపించ బోతున్నారు.
అందుకోసం ఆయన కొత్త లుక్లో కనిపించ బోతున్నారట. ఇందులోని ప్రేమ కథ ఆసక్తి కరంగా ఉంటుందని సమాచారం. స్వాతంత్య్ర పోరాటానికి ముందు సాగిన అద్భుతమైన పోరాట ఘట్టాలను దర్శకుడు సత్యశివ ఇందులో చూపించబోతున్నారట. రెజీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. తెలుగులో సి.కళ్యాణ్ నిర్మిస్తుండగా బాలీవుడ్లో రానా నిర్మిస్తున్నారు.
భిన్న చిత్రాలు, ప్రయోగాత్మక పాత్రలకు కేరాఫ్ విక్రమ్. తాజాగా ఆయన కర్ణుడిగా మారబోతున్నారు. మహాభారతంలోని కర్ణుడి పాత్రను ఇతివృత్తంగా తీసుకుని ఓ సినిమాను రూపొందించేందుకు మలయాళ దర్శకుడు ఆర్ఎస్ విమల్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కర్ణుడి పాత్రకు విక్రమ్ను ఎంపిక చేశారట. రూ.300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. యునైటెడ్ ఫిల్మ్ కింగ్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని హిందీతోపాటు దక్షిణాది భాషల్లోనూ తెరకెక్కించబోతున్నారు. ఈ ఏడాది అక్టోబర్లో ప్రారంభించి, వచ్చే ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
గతంతో పోలిస్తే ప్రస్తుతం పీరియాడిక్ డ్రామాల నేపథ్యంలో దాదాపు అన్ని భాషా చిత్రపరిశ్రమలు సినిమాలను రూపొందించేందుకు ప్రయత్నించడం అభినందించదగ్గ విషయం.