Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్, భవ్యశ్రీ, శ్వేతారెడ్డి హీరోహీరోయిన్లుగా అర్జున్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బగ్గిడి గోపాల్'. బగ్గిడి ఆర్ట్ మూవీస్ పతాకంపై బగ్గిడి గోపాల్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న బయోపిక్ చిత్రమిది. 'రైట్ రైట్ టు అధ్యక్షా' అనేది ట్యాగ్లైన్. ఈ చిత్ర ప్రారంభోత్సవం శుక్రవారం ఫిల్మ్ ఛాంబర్లో జరిగింది. మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, ఆర్.కె.గౌడ్ కెమెరా స్విచాన్ చేశారు. సాయి వెంకట్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ, 'బగ్గిడి గోపాల్ జీవిత కథతో వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. బగ్గిడి గోపాల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను కూడా ఎమ్మెల్యేగా ఉండేవాడిని. ఆయన ఇలాంటి మరెన్నో సినిమాలు చేయాలి' అని అన్నారు. బగ్గిడి గోపాల్ చెబుతూ, 'ఒక సామాన్య ఆర్టీసీ కండక్టరైన నేను శాసనసభ్యుడిగా ఎలా ఎదిగాననేది ఒకటో భాగంగా చిత్రీకరిస్తున్నాం. ఆకలి తెలిసిన వాడు ఎమ్మెల్యే అయితే ప్రజలకు ఎలా సేవ చేస్తాడు?, శాసన సభలో ఎదుర్కొన్న సవాళ్ళు?, కొంత మంది వల్ల నా ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడిందనేది రెండో భాగంలో చూపిస్తున్నాం. విద్యార్ధి దశ నుంచి ఇప్పటి వరకు నా జీవితం అనేక మలుపులతో సాగింది. అవన్నీ వెండితెరపై ఆవిష్కరిస్తాం' అని చెప్పారు. 'నేను రూపొందిస్తున్న మరో సినిమాలో బగ్గిడి గోపాల్ విలన్గా నటిస్తున్నారు. అందులో నా వర్క్ నచ్చి ఈ బయోపిక్ను చేసే అవకాశం కల్పించారు' అని దర్శకుడు అర్జున్ కుమార్ తెలిపారు.