Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేనెప్పుడూ క్రియేటివ్గా ఆలోచిస్తానే తప్ప డబ్బు గురించి ఆలోచించను. భవిష్యత్లో మాత్రం కచ్చితంగా దర్శకత్వం వహిస్తాను' అని అంటోంది నిత్యా మీనన్. ఆమె లెస్బియన్గా నటించిన చిత్రం 'అ'.
ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హీరో నాని నిర్మించారు. ఇటీవల విడుదలైన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో నిత్యా మీనన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ, 'లెస్బియన్ పాత్ర గురించి చెప్పినప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యాను. హీరోయిన్లను ఎక్కువగా మూసధోరణిలోనే చూపిస్తుంటారు. ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. నటీనటులుందరీ కొత్త పంథాలో ఆవిష్కరించిన చిత్రంలో నేనూ నటించడం ఆనందంగా ఉంది. సవాల్తో కూడిన పాత్రలు చేయడమంటే చాలా ఇష్టం. లేకపోతే బోర్ కొడుతుంది. ఇందులో లెస్బియన్ పాత్ర అలాంటిదే. పాత్ర ప్రయారిటీ గురించే తప్ప పాత్ర నిడివి గురించి పట్టించుకోను. కథేంటి?, దర్శకుడి ఆలోచనలు ఎలా ఉన్నాయి?, తెరపై సినిమా ఎలా ఉండబోతుందనేది చూసుకుంటాను. అవన్నీ బాగుంటేనే సినిమా చేస్తా. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో 'గంగ'లోని పాత్ర చాలా కష్టంగా అనిపించింది. నిజ జీవితానికి పూర్తి భిన్నమైన పాత్ర కావడంతో దానికి న్యాయం చేయడం పెద్ద ఛాలెంజింగ్గా అనిపించింది. ఆ తర్వాత ఈ చిత్రంలోని పాత్ర అలాంటి అనుభూతిని పంచింది. దీంతోపాటు నేను చేసే పాత్రలు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది కూడా చూసుకుంటాను. నటిగా అది నా బాధ్యత కూడా. చెడు పాత్రలను ఎంకరేజ్ చేయను. మంచికే ప్రయారిటీ. 'మహానటి' చిత్రంలో సావిత్రి పాత్ర కోసం నన్ను అడిగిన మాట వాస్తవమే. కానీ కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ కాలేదు. 'ఎన్టీఆర్' బయోపిక్ కోసం కూడా అడిగారు. ఎందుకు చేయలేదనేది మాత్రం చెప్పలేను. నాకు కథ నచ్చితే నిర్మాతలను కూడా వెతికి పెట్టిన సందర్భాలున్నాయి. స్క్రిప్ట్ పరంగా అవసరమైన సలహాలు, సూచనలు కూడా ఇస్తాను. ప్రస్తుతం 'ప్రాణ' అనే చిత్రంలో నటిస్తున్నా. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ఆ యూనిట్లో నాలుగు భాషలు తెలిసిన వ్యక్తిని నేనొక్కదాన్నే ఉన్నా. మలయాళంలో రాసుకున్న కథను తెలుగు, తమిళం, హిందీ భాషల్లోకి అనువాదం చేసి సంభాషణలు రాశా. స్క్రిప్ట్ పనుల్లో తొలిసారి భాగమయ్యాను. కేరళ హిల్ స్టేషన్లో ఈ సినిమా చేశాం. 23 రోజుల్లోనే నాలుగు భాషల్లో సినిమాను పూర్తి చేశాం. భవిష్యత్లో దర్శకత్వం వహించే ఆలోచన కూడా ఉంది. అయితే నిర్మాతగా మాత్రం మారను. కథానాయికల ఆలోచనలను అర్థం చేసుకోకుండా కొందరు విమర్శిస్తుంటారు. అలాంటి విషయాలు బాధ కలిగిస్తాయి. సినిమా బాగా లేకపోతే దాని వరకే విమర్శించాలి. కానీ వ్యక్తిగత అంశాల్ని ప్రస్తావించడం సరికాదనేది నా అభిప్రాయం. తెలుగు సినిమాల్లో విప్లవాత్మకమైన మార్పులు రావాల్సిన అవసరం ఉంది. భాషాభేదాలతో సంబంధం లేకుండా కొత్త తరహా కథాంశాల్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కాబట్టి ప్రయోగాత్మక చిత్రాల వైపు మొగ్గుచూపాలి. మలయాళ చిత్రాలు హాలీవుడ్తో పోటీపడుతున్నాయి. ఆ విధంగా జయాపజయాల గురించి కాకుండా వైవిధ్యమైన కథలను తెరకెక్కిస్తే బాగుంటుంది' అని తెలిపింది.