Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోహన్లాల్, అల్లు శిరీష్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన మలయాళ చిత్రం '1971 బియాండ్ బార్డర్స్'. మేజర్ రవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని జాష్ రాజ్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్ బాలాజీ తెలుగులో 'యుద్ధభూమి' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఏఎన్ బాలాజీ మాట్లాడుతూ, 'చిత్ర దర్శకుడు మేజర్ రవి నిజజీవితంలో కూడా మేజర్ కావడం విశేషం. ఆయన 1981లో ఆర్మీలో చేరి అనేక కీలక ఆపరేషన్స్ చేపట్టారు. 2002 లో మొదటి సారి దర్శకుడిగా మారి 'పునర్జని' అనే మలయాళ చిత్రాన్ని రూపొందించారు. అప్పట్నుంచి దేశభక్తిని చాటుకుంటూ ఆర్మీలో పనిచేసే టైమ్లో జరిగిన ఆపరేషన్స్కి సంబంధించిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా పలు సినిమాలను రూపొందించారు. అందులో భాగంగా 1971లో భారత-పాక్ సరిహద్దుల్లో జరిగిన వాస్తవ సంఘటనలతో ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో మేజర్గా మోహన్లాల్, ఎనర్జిటిక్, యంగ్ డైనమిక్ సోల్జర్గా అల్లు శిరీష్ కనిపిస్తారు. ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని అనువాదం చేస్తున్నాం. ప్రస్తుతం అల్లు శిరీష్ డబ్బింగ్ చెబుతున్నారు. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఈ నెలాఖరులో ఆడియోను విడుదల చేస్తాం. మార్చి మొదటి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. గతంలో తమిళం, మలయాళం, హిందీ చిత్రాలను తెలుగులోకి అనువదించాను. ప్రతి సినిమా విజయం సాధించింది. ఈ సినిమా కూడా అదే మాదిరిగా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అని అన్నారు.