Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను రూపొందించిన 'నేనొక్కడినే', 'నాన్నకు ప్రేమతో..' చిత్రాలు యుఎస్లో చక్కని వసూళ్లను రాబట్టాయి. అక్కడ ఓ వ్యక్తి కలిసి 'మీరు తీసిన సినిమాలు చాలా బాగున్నాయి. మన నేపథ్యంతో, మన సంస్కృతితో సినిమాలెందుకు తీయడం లేదు' అని అడిగాడు. నాకే సిగ్గు అనిపించింది. ఆయన ప్రశ్నకు సమాధానమే ఈ 'రంగస్థలం' చిత్రం' అని దర్శకుడు సుకుమార్ అన్నారు.
రామ్చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై.నవీన్, రవిశంకర్, మోహన్(సీవీఎం) సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'రంగస్థలం'. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో సుకుమార్ మాట్లాడుతూ, 'ఇప్పటికే విడుదలైన 'ఎంత సక్కగున్నావే..', 'రంగ రంగ రంగస్థలానా..', 'రంగమ్మ మంగమ్మ..' పాటలు శ్రోతలను బాగా అలరిస్తున్నాయి. తాజాగా మరో రెండు పాటలైన 'ఆ గట్టుకుంటావా.. ఈ గుట్టకుంటావా..', ఐటెమ్ సాంగ్ 'జిగేల్ రాణి..' లను జ్యూక్ బాక్స్లో విడుదల చేశాం. మరో సర్ప్రైజ్ సాంగ్ ఉంటుంది. దాన్ని చంద్రబోస్ పాడారు. 1980 బ్యాక్డ్రాప్లో సాగే చిత్రమిది. నేను దాదాపు 28ఏండ్లు పల్లెటూరులోనే పెరగడంతో దానిపై మంచి అవగాహన ఉంది. ఈ సినిమా చేయడం వల్ల నా ఆత్మను వెతుక్కున్నట్టు ఉంది. ఇలాంటి సినిమా చేయాలని ఎప్పట్నుంచో ఉంది. ఇప్పటికి కుదిరింది. నాకు మంచి టెక్నీకల్ టీమ్ దొరకడంతో సినిమా చేయడం చాలా ఈజీ అయ్యింది. ముఖ్యంగా ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ, మోనిక ఆనాటి బ్యాక్డ్రాప్ సెట్ను అద్భుతంగా వేశారు. అది చూసి నేనే ఆశ్చర్యపోయాను. దేవిశ్రీప్రసాద్, చంద్రబోస్ మంచి క్రియేటివ్ పర్సన్స్. చంద్రబోస్ ప్రతి సాంగ్ను పదిపదిహేను నిమిషాల్లోనే రాశారు. పాట రాసిన తర్వాతే ట్యూన్స్ కంపోజ్ చేయడం జరిగింది. 'రంగమ్మ.. మంగమ్మ' పాటలో 'గొల్లబామ' అనే పదం ఓ కీటకానికి సంబంధించినది. వ్యక్తులను ఉద్దేశించినది కాదు. నా సినిమాలో ఐటెమ్ సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. దీంతో అప్పట్నుంచి ఆ పాటలు కంపల్సరీగా పెడుతున్నాం. ఈ చిత్రంలోని పాటను కూడా నిర్మాతలకు నచ్చడంతోనే పెట్టాం. కచ్చితంగా అది ఆకట్టుకుంటుంది' అని అన్నారు.
'విడుదలైన పాటలకు శ్రోతల నుంచి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న వైజాగ్లోని ఆర్కే బీచ్లో గ్రాండ్గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నాం. చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సినిమాపై నమ్మకంతో ఉన్నాం. ఈ నెల 30న సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం' అని నిర్మాత నవీన్ ఎర్నేని తెలిపారు. చంద్రబోస్ చెబుతూ, 'మంచి సాహిత్యానికి, మంచి సంగీతం కుదిరింది. ఇంతమంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. పల్లెటూరు నేపథ్యంలో సినిమా కాబట్టి పదాలను ఈజీగా రాశాను. అవి బాగా కనెక్ట్ అయ్యాయి' అని చెప్పారు. 'నేను పెరిగింది సిటీలోనే అయినా పల్లెటూరును మిస్ అయిన ఫీలింగ్ ఉండేది. ఈ సినిమాలో పల్లెటూరు సెట్ వేయడంతో ఆ కొరత తీరింది. రీసెర్చ్ చేసి సెట్ వేశాను. అది సినిమాకు హైలైట్గా నిలుస్తుంది' అని ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు.