Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మూడు నిమిషాల్లో 236 దేశాలను గుర్తించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సొంతం చేసుకున్న చిన్నారి చిరుతేజ్ సింగ్ జీవితం ఆధారంగా లఘు చిత్రం రూపొందించడం చాలా సంతోషంగా ఉంది' అని దర్శకుడు డా.ఆనంద్ కుమార్ అన్నారు. చిరుతేజ్ సింగ్, మనాలి రాథోడ్, సౌమ్య వేణుగోపాల్, రాజశేఖర్, ఎన్.ఎస్.నాయక్ ప్రధాన పాత్రధారులుగా బంజారా మూవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎన్.ఎస్.నాయక్ నిర్మించిన లఘు చిత్రం 'చిరు తేజ్ సింగ్'. ఈ షార్ట్ ఫిల్మ్ను పలువురు సినీ ప్రముఖులకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. వారి ప్రశంసలందుకున్న సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు మాట్లాడుతూ, 'మహబూబాబాద్కు చెందిన చిరుతేజ్ సింగ్ 4వ తరగతి చదువుతోంది. ఈ వయసులోనే చదువులో అసాధారణమైన ప్రతిభను కనబరిచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుతోపాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ చిన్నారి ప్రతిభను అందరికీ తెలియాలని, నేటితరం పిల్లలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో కొన్ని కల్పిత సన్నివేశాలను మేళవించి ఈ లఘు చిత్రాన్ని రూపొందించాం. తల్లీకూతుళ్ళ మధ్య ప్రేమ, టీచర్, స్టూడెంట్ మధ్య ఉన్న ఆసక్తికరమైన అంశాలను మనసుకు హత్తుకునేలా తెరకెక్కించాం. ఇటీవల సమంతగారు అభినందనలు తెలిపారు. తాజాగా రాజ్ కందుకూరి, వీరశంకర్ తదితరులు సినిమా చూసి ప్రశంసించారు. ఇలాంటి పిల్లలను ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే చిరుతేజ్ సింగ్ను బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించాలి' అని అన్నారు. 'నాపై షార్ట్ ఫిల్మ్ తీయడం చాలా ఆనందంగా ఉంది' అని చిరుతేజ్ సింగ్ తెలిపారు. నిర్మాత ఎన్.ఎస్.నాయక్ చెబుతూ, 'ఈ బాలిక గురించి తెలిసి, ఆమె ప్రతిభ పదిమందికి తెలియాలని ఈ లఘు చిత్రాన్ని నిర్మించాను' అని చెప్పారు.