Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రస్తుతం సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాను. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఇప్పటికైతే లేదు. చిత్ర పరిశ్రమలో హ్యాపీగా ఉన్నాను' అని అంటున్నారు కథానాయకుడు కళ్యాణ్ రామ్.
'ఇజం' తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఎంఎల్ఎ'. కాజల్ కథానాయికగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం మీడియాతో కళ్యాణ్రామ్ ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం ఆయన మాటల్లోనే...
పొలిటికల్ టచ్..
దర్శకుడు ఉపేంద్ర మాధవ్ చెప్పిన కథ ఫ్రెష్గా, జెన్యూన్గా అనిపించింది. నా పాత్ర కూడా కొత్తగా ఉంది. స్క్రిప్ట్ బాగా నచ్చడంతో చేశాను. కళ్యాణ్ అనే కార్పొరేట్ జాబ్ చేసే కుర్రాడిగా కనిపిస్తాను. తమ ఊరిలో తరతరాలుగా ఉన్న ఓ రాజకీయ నాయకుడు ఫ్రాడ్ చేస్తుంటాడు. అప్పుడు హీరో ఎంటరై ఏం చేశాడు?, ఊర్లో సమస్య కోసం ఎలా ఫైట్ చేశాడనేదే సినిమా. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్.
'లక్ష్మీ కళ్యాణం' తర్వాత కాజల్తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. విద్య ప్రాధాన్యతను తెలిపే పాత్రలో కాజల్ కనిపిస్తుంది. ఉపేంద్ర ఒక ప్రత్యేకమైన డిక్షన్ ఉన్న దర్శకుడు. డైలాగ్ డెలివరీ, బాడీ స్టయిల్ ఎలా ఉండాలో పర్ఫెక్ట్గా చూసుకున్నారు. ఆ విషయంలో ఎక్కడా రాజీపడలేదు.
సక్సెస్ కోసం ప్రయత్నం..
కార్పొరేట్ బ్యాక్డ్రాప్లో సాగే లవ్ స్టోరీతో ఫస్టాఫ్ ఉంటే, ద్వితీయార్థం పొలిటికల్ టచ్తో ఉంటుంది. అలాగని పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉండదు. కథ డిమాండ్ మేరకు ఎంత ఉండాలో అంతే ఉంటుంది. భారీ పొలిటికల్ డైలాగ్లున్నప్పటికీ అది సినిమాకే పరిమితం. నేను రాజకీయాల్లోకి రావడం కోసం కాదు. ప్రస్తుతానికి ఆ ఆలోచనలేదు. మన్ముందు వస్తానో రానో కూడా తెలియదు. అందరు అన్నట్టు ప్రస్తుతానికి సక్సెస్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాను (నవ్వుతూ). నటుడిగా, నిర్మాతగా సంతోషంగా ఉన్నాను. కమర్షియల్ రిజల్ట్ పక్కన పెడితే 'ఇజం' సినిమా విషయంలో ఒక ఆర్టిస్టుగా చాలా సంతృప్తిగా ఉన్నా. నటుడిగా నన్ను చాలా అంశాల్లో ఓపెన్ చేసిన చిత్రమది. అది ఈ సినిమాకు ఉపయోగపడింది. ఇందులో నా డైలాగ్ డిక్షన్, బాడీ లాంగ్వేజ్లో చాలా మార్పు కనిపిస్తుంది.
నచ్చితేనే చేస్తా..
నేను ఏ సినిమా చేసినా నా గత చిత్రాలకు, పాత్రలకు భిన్నంగా, నాకు కొత్తగా ఉండే వాటికే ప్రయారిటీ ఇస్తాను. అంతేకాదు సమ్థింగ్ స్పెషల్ అనుకునేలా ఉండాలి. అలాంటి కథ వస్తేనే చేస్తాను. లేకపోతే అస్సలు చేయను. ప్రస్తుతం చేస్తున్న 'ఎంఎల్ఏ', తదుపరి సినిమా 'నా నువ్వే' జెన్యూన్గా నమ్మి చేస్తున్నవే. 'నా నువ్వే' చిత్రానికి జయేంద్ర దర్శకుడు. ఫ్యూర్ లవ్ స్టోరీ చిత్రమిది. మొదటిసారి లవ్ స్టోరీ చేస్తున్నా. చాలా ఫ్రెష్గా ఉంటుంది. తమిళ దర్శకుడైనప్పటికీ యూనివర్సల్ కాన్సెప్ట్ కావడంతో ఈ సినిమా మన ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ తమిళ ఛాయలు ఎంత మాత్రం కనిపించవు.
ఈ ఏడాదిలో మల్టీస్టారర్..
నేను మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు కూడా సిద్ధమే. ఏ హీరోతోనైనా చేస్తాను. ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సాయిధరమ్తేజ్తో ఓ మల్టీస్టారర్ సినిమా చేయాల్సి ఉంది. స్క్రిప్ట్ సంతృప్తిగా అనిపించలేదు. ప్రస్తుతం ఓ మల్టీస్టారర్కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అది ఈ ఏడాదిలోనే ఉంటుంది. దానికి దర్శకుడు పవన్ సాధినేనా?, ఇందులో ఎన్టీఆర్ నటిస్తాడా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తమ్ముడు ఎన్టీఆర్, నేను తరచూ కలుస్తూనే ఉంటాం. సినిమాలు, సినిమాల సన్నివేశాలు, ప్రజెంట్ పాలిటిక్స్ వంటి తదితర అంశాల గురించి మేమిద్దరం చర్చించుకుంటాం. తనకు నటన పట్ల కాన్పిడెన్స్ ఎక్కువ. ఈ చిత్ర ట్రైలర్ చూసి చాలా ఫ్రెష్గా ఉందన్నాడు.