Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలానుగుణంగా భారతీయ చిత్ర పరిశ్రమలోనూ పెను మార్పులు సంతరించుకుంటున్నాయి. ప్రయోగాత్మక చిత్రాలు, భారీ మల్టీస్టారర్ చిత్రాలు, అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలు.. ఇలా రకరకాల మార్పులతో భారతీయ చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయి మార్కెట్ను విస్తరించుకుంటోంది. ఇందులో భాగంగా 'బాహుబలి' తర్వాత భారీ బడ్జెట్తో కూడిన సినిమాలను తీసేందుకు ఫిల్మ్ మేకర్స్ అమితాసక్తి చూపుతున్నారు. మలయాళంలో మహాభారతం నేపథ్యంలో ఇప్పటికే ఓ భారీ చిత్రం నిర్మాణంలో ఉంది. అలాగే హిందీలో 'మహాభారతం' తీయబోతున్నట్టు ఇప్పటికే అమీర్ ఖాన్ ప్రకటించారు. దీనికి తగ్గట్టుగానే సినిమా కోసం నటీనటులను ఎంపిక చేసే పనిలో ఆయన ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ద్రౌపది పాత్ర కోసం దీపికా పదుకొనెను ఫైనల్ చేశారు. అలాగే కృష్ణుడి పాత్ర కోసం సల్మాన్ఖాన్ని అమీర్ ఇటీవల సంప్రదించి పాత్ర తీరు తెన్నుల గురించి కూలంకషంగా వివరించారు. దీంతో కృష్ణుడిగా నటించేందుకు సల్మాన్ పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. అయితే తన సొంత స్టయిల్లో 'మహాభారతం' చేయాలని సల్మాన్ కూడా భావించినప్పటికీ అమీర్ ప్రాజెక్ట్ను గౌరవిస్తూ ఆయనకు సపోర్ట్ చేయాలని సల్మాన్ నిర్ణయించుకున్నారట. ఇక ఇందులో మరో పెద్ద స్టార్ నటించనున్నారు. బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ ధృతరాష్ట్రుడు పాత్రలో నటించేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. అర్జునుడి పాత్రలో అమీర్ ఖాన్ నటించనున్నారు. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్పై ముఖేష్ అంబానీ నిర్మించబోతున్నారు. అమీర్ ప్రస్తుతం 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్'లో నటిస్తున్నారు.