Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్బాబు, అదితీరావు హైదరి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'సమ్మోహనం'. ఈ చిత్రంలో
తన పాత్రకు అదితీరావు హైదరి సొంతంగా డబ్బింగ్ చెబుతోంది. ఆ విశేషాలను నిర్మాత కృష్ణప్రసాద్ తెలియజేస్తూ, 'ఇంద్రగంటి ఎప్పుడూ తెలుగుదనానికి ప్రాధాన్యతనిస్తారు. దాదాపుగా తెలుగమ్మాయిలనే హీరోయిన్లుగా ఎంపిక చేసుకుంటారు. ఈ చిత్రంలో నటిస్తున్న అదితీరావు హైదరి తెలుగు మూలాలున్న అమ్మాయి. కానీ ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని సొంతం డబ్బింగ్ చెబుతోంది. డబ్బింగ్ చాలా బాగా వచ్చింది. అదితి గొంతు ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన తొలిపాటకు మంచి స్పందన లభిస్తుంది. జూన్ 15న సినిమాను విడుదల చేస్తాం' అని అన్నారు. 'కొత్త ఎత్తుగడ, కొత్త పోకడ ఉన్న నవతరం కథ ఇది. రొమాన్స్, హాస్యం సమ్మేళనంగా ఉంటుంది. పి.జి.విందా ఫొటోగ్రఫీ, వివేక్ సాగర్ సంగీతం, రవీందర్ ఆర్ట్ ఆకట్టుకుంటాయి. మంచి కథ, కథనానికి మంచి నిర్మాణ విలువలు తోడయ్యాయి. టైటిల్కి తగ్గట్టుగానే సినిమా మొత్తం అందమైన ఫీల్ క్యారీ అవుతుంది' అని దర్శకుడు ఇంద్రగంటి తెలిపారు. నరేష్, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్, హర్షిణి, నందు, కాదంబరి కిరణ్, హరితేజ్, రాహుల్ రామకృష్ణ, కేదార్ శంకర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.