Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'టైగర్ జిందా హై' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'రేస్ 3'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'రేస్' చిత్ర ఫ్రాంచైజీ సైతం సూపర్ హిట్గా నిలవడమే ఈ అంచనాలు పెరగడానికి ముఖ్య కారణం. దీంతో ఈ సినిమాపై అటు సల్మాన్ అభిమానుల్లోను, ఇటు చిత్ర వర్గాల్లోనూ భారీ క్రేజ్ నెలకొంది. దీనికితోడు ఇటీవల విడుదలైన ట్రైలర్ మరింత బలాన్ని చేకూర్చింది. యాక్షన్, రొమాన్స్, ఫన్ మేళవింపుగా థ్రిల్లర్గా సాగే ఈ ట్రైలర్ అభిమానులను, ఆడియెన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సల్మాన్ ఫ్యాన్స్కిది పర్ఫెక్ట్ ట్రీట్ అని చిత్ర వర్గాలంటున్నాయి. అబుదాబి, థాయిలాండ్లో కంపోజ్ చేసిన స్టంట్స్ ట్రైలర్లో హైలైట్గా నిలిచాయి. రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కథానాయికగా నటిస్తోంది. అనిల్ కపూర్, బాబీ డియోల్, సాక్విబ్ సలీమ్, డైసీ షా ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రంజాన్ సందర్భంగా జూన్ 15న సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ట్రేడ్ వర్గాల్లో సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది. ఈ చిత్ర శాటిలైట్ హక్కులు రూ.100కోట్లకు అమ్ముడయ్యాయి. రూ.120 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా శాటిలైట్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవ్వడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. దీంతోపాటు సల్మాన్ ప్రస్తుతం 'భారత్' చిత్రంలో నటిస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, దిశా పటానీ కథానాయికలుగా నటిస్తున్నారు.