Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశైర్య, బేబి షామిలి జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ పతాకంపై రాజేష్ నిర్మిస్తున్న చిత్రం 'అమ్మమ్మగారిల్లు'. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక బుధవారం హైదరాబాద్లో జరిగింది. చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను 'మా' అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా విడుదల చేశారు. అలాగే పాటల తొలి సీడీని హీరో నాగశౌర్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ, 'ఇంట్లో మా మనవరాలు అమ్మమ్మ అంటూ మా ఆవిడను పిలుస్తుంటే చాలా హాయిగా ఉంటుంది. తాత అనే పిలుపులో పెద్దగా మాధుర్యం కనిపించలేదు కానీ అమ్మమ్మ పిలుపులో ఏదో తెలియని మాయ ఉంది. అలాంటి అమ్మమ్మ కథతో దర్శకుడు సినిమా తీశారు. షూటింగ్ జరిగినన్ని రోజులు చెట్టు కింద కలిసి భోజనాలు చేయడం పాత రోజులను గుర్తు చేశాయి. అన్ని అనురాగాలున్న చిత్రమిది. తప్పకుండా హిట్ అవుతుంది' అని అన్నారు. 'ఇందులో రావు రమేష్ నటించిన పాత్ర మన ఇంట్లో కనిపించే వ్యక్తిలా అనిపిస్తుంది. సుమిత్రగారు అమ్మమ్మ పాత్రకు అతికినట్టు సరిపోయారు. దర్శకుడు సుందర్ మంచి కథ చెప్పడమే కాదు, చెప్పినట్లు తీశారు. మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్తో సినిమాను తెరకెక్కించారు. నేడు సినిమా విడుదల కానుంది. చూసిన ప్రతి ఒక్కరికి ఇది తమ అమ్మమ్మను గుర్తు చేస్తుంది. దర్శకుడు, నిర్మాతలు మరిన్ని మంచి సినిమాలు చేయాలి. రసూల్ అద్భుతమైన విజువల్స్ అందించారు. షామిలి చిన్నప్పుడు ఇష్టం. తను నటించిన సినిమాలు చూశాను. ఇప్పుడు ఆమెతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది' అని నాగశౌర్య తెలిపారు. దర్శకుడు సుందర్ సూర్య చెబుతూ, 'ఎంతో మంది అనుభవం ఉన్న నటీనటులు సినిమా కోసం కష్టపడి చేశారు. నాగశౌర్య లేకపోతే సినిమా లేదు. రెండేండ్ల పాటు స్క్రిప్ట్ను తయారు చేశాను. కళ్యాణ్ మాలిక్ సినిమాలో రెండు సాంగ్స్ ఇచ్చారు. సాయికార్తీక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, థీమ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్' అని చెప్పారు. 'ఇంత మంచి సినిమా చేశామంటే కారణం నాగశౌర్య, షామిలి, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందించిన సహకారమే. సినిమా బాగా వచ్చింది. అందరికి నచ్చుతుంది' అని నిర్మాత రాజేష్ చెప్పారు.