Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాలీవుడ్లో దర్శకుడు రాజ్ కుమార్ హిరానీకి నేను పెద్ద అభిమానిని. కుదిరితే ఆయనతో ఓ సినిమా చేయాలనుంది' అని రామ్ చరణ్ అన్నారు. ఓ ప్రైవేట్ వేడుకలో పాల్గొన్న రామ్చరణ్ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, 'గత కొంత కాలంగా బయటి వారి నుంచి ఎలాంటి డబ్బు తీసుకోకుండా ఛారిటబుల్ ట్రస్ట్ నడిపిస్తున్నాం. కొన్ని రోజులుగా నేనూ, నాన్న(చిరంజీవి) కొత్త ఛారిటీ గురించి ఆలోచిస్తున్నాం. అందులో భాగంగానే నేను మళ్లీ బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు ఒప్పుకున్నా.
కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఛారిటీ కోసం నేను ఒప్పుకున్న బ్రాండ్స్ నుంచి వచ్చే ఆదాయంలో 15 శాతం కేటాయిస్తా. ఆ ఛారిటీ వివరాలు త్వరలోనే తెలియజేస్తాను. ఆరోగ్య సమస్యలున్న ప్రజలకు ఉపయోగపడేలా ఈ ఫౌండేషన్ సేవలందిస్తుంది' అని అన్నారు. బాలీవుడ్లో నటించడంపై ఆయన స్పందిస్తూ, 'బాలీవుడ్లో సినిమా చేయాల్సి వస్తే రాజ్కుమార్ హిరానీతో పనిచేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకు నేను పెద్ద అభిమానిని. ఆయన ఆర్ట్ను, కమర్షియల్ అంశాలను బ్యాలెన్స్ చేస్తూ అందంగా సినిమాను తెరకెక్కిస్తారు. అలాగే బాలీవుడ్లో విశాల్ భరద్వాజ్ సినిమాలు కూడా చూస్తుంటాను. ఆయన చిత్రాలు ఆమేజింగ్. ఆయనతో వర్క్ చేయడాన్ని కూడా అదృష్టంగా భావిస్తాను. అన్ని కుదిరితే, ఆసక్తికరమైన కథ వస్తే బాలీవుడ్లోనూ నటించేందుకు నేను సిద్ధమే. అలాగే మనం ఏ ప్రేక్షకులను ఉద్దేశించి సినిమాలు చేస్తున్నామనేది కూడా ముఖ్యమే. ప్రస్తుతం ప్రయోగాత్మక చిత్రాలు ఆదరణ పొందుతున్నాయి. నా వరకు నేను కంఫర్ట్ జోన్ని దాటి సినిమాలు చేయాలనుంది. పవన్ బాబారుకి రాజకీయాల్లో కుటుంబ పరంగా మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఆయన ఆహ్వానిస్తే ప్రచారం చేయడానికి సిద్ధమే' అని చెప్పారు. 'ఓ సినిమా హిట్ అవుతుందా? లేదా? అనేది ప్రయత్నించిన తర్వాతే తెలుస్తుంది. ఏ సినిమా నిర్మాత అయినా కలెక్షన్లకు సంబంధించి కచ్చితమైన లెక్కలే చెబుతారు. భవిష్యత్లో నా సినిమా పోస్టర్లపై కలెక్షన్ల వివరాలు లేకుండా చూసుకుంటా.
సినిమాను సినిమాలా ఉంచేందుకు ప్రయత్నిస్తా. మీ సినిమా బాగుందని పది మంది చెప్పుకోవడంలో ఉన్న ఆనందం నంబర్స్ను చెప్పడంలో ఉండదు. పైగా కలెక్షన్లు ఇటీవల లేనిపోని వివాదాలను సృష్టిస్తున్నాయి' అని అన్నారు.