Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమర్, సంతోషి, షాలు చౌరస్యలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళీ, యోగి ప్రధాన పాత్రధారులుగా ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిల్మ్స్ పతాకంపై రవి కిషోర్ చందిన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అంతర్వేదం'. జె.ఎస్.నిథిత్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం జరిగింది. అతిథిగా విచ్చేసిన నిర్మాత రాజ్కందుకూరి ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'సినిమా ద్వారా కొత్తగా ఇండిస్టీకి పరిచయం అవుతున్న వారందరికి అభినందనలు. ఈ చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకోవాలి' అని అన్నారు. 'ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. వేరే రంగాల్లో విజయ కేతనం ఎగురవేస్తున్నప్పటికీ, మానసిక సంతృప్తి కోసం సినిమా రంగంలోకి చాలా మంది వస్తున్నారు. వాళ్ళందరూ తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ చిత్రంలో నటించిన వారంతా కొత్తవాళ్ళే. సినిమా పట్ల వాళ్ళ ప్యాషన్, ప్రేమ చూస్తుంటే ముచ్చటేస్తుంది. సినిమా కోసం వారు పడ్డ కష్టానికి ఫలితం లభిస్తుంది' అని తనికెళ్ల భరిణి తెలిపారు. దర్శకుడు చందిన రవికిషోర్ చెబుతూ, 'నేను చెప్పిన కథ నచ్చి తనికెళ్ళ భరణి మొదలుకొని ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అంతా ఫ్రీగా ఇప్పటి వరకు రూపాయి కూడా తీసుకోకుండా సినిమా కోసం వర్క్ చేశారు. వారందరికి థ్యాంక్స్. మనిషి డ్రీమ్(కల) రహస్యం గురించి తెలిపే చిత్రమిది' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో అమర్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జబర్దస్త్ రాంప్రసాద్, రైజింగ్రాజు తదితరులు పాల్గొన్నారు.