Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్కిరణ్ సినిమా పతాకంపై రూపొందుతున్న చిత్రం 'విశ్వామిత్ర'. నందితరాజ్, సత్యంరాజేశ్, అశుతోష్రాణా, ప్రసన్నకుమార్, విద్యుల్లేఖా రామన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. రాజ్కిరణ్ దర్శకత్వంలో మాధవి అద్దంకి, రజనీకాంత్.ఎస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ లోగోను ప్రసాద్ల్యాబ్స్లో అశుతోష్ రాణా ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'ఈ చిత్రంలో నేనొక పొసెసివ్ భర్త పాత్రలో కనిపిస్తాను. దర్శకుడు రాజ్కిరణ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది' అని చెప్పారు. 'వాస్తవ సంఘటన ఆధారంగా ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. యు.ఎస్లో జరిగిన ఘటనకు సంబంధించి ఓ ఆర్టికల్ చదివి, దాని ఆధారంగా ఈ చిత్రకథను తయారు చేసుకున్నాను. ఓ స్నేహితుడికి కథ చెబితే, ఇలా కూడా జరుగుతుందా అని అడిగారు. ఆయనే ఇలాంటి ఘటన స్విజ్జర్లాండ్లో కూడా జరిగిందని చెప్పారు. ఆ ఘటన తాలూకా వివరాలను కూడా ఈ చిత్రకథలో జోడించాను. ఫస్ట్ హియరింగ్లోనే నిర్మాతలు మాధవి, రజనీకాంత్ సినిమా చేద్దామని చెప్పడం ఆనందంగా ఉంది. సత్యంరాజేశ్ హీరో అనగానే చాలా మంది హీరోయిన్లు కథ బాగున్నప్పటికీ డ్రాప్ అయిపోయారు. కానీ నందితరాజ్ మాత్రం ఈ సినిమా చేసేందుకు అంగీకరించడం సంతోషంగా ఉంది. ఇప్పటివరకు జరిపిన షూటింగ్తో 50శాతం పూర్తయ్యింది. నా మిత్రుడు వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ చిత్రానికి మాటలు అందించారు. అలాగే మరో మిత్రుడు బి.వి.ఎస్.రవి అందిస్తున్న సహకారం మరువలేనిది' అని దర్శకుడు రాజ్కిరణ్ అన్నారు. 'దర్శకుడు రాజ్కిరణ్ ఏడాదిన్నర క్రితం ఈ కథ చెప్పారు. నాకెంతో బాగా నచ్చింది. కథాపరంగా నాది హీరో క్యారెక్టర్ కాదు. కానీ ప్రాముఖ్యత ఉన్న పాత్ర. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం' అని సత్యంరాజేశ్ అన్నారు. 'చాలా మంచి కథ. ఈ కథ గురించి ఇప్పుడే నేనేమీ చెప్పలేను. అయితే నా పాత్ర మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది' అని కథానాయిక నందితరాజ్ చెప్పారు. 'యు.ఎస్., స్విజ్జర్లాండ్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాం. ఇదొక థ్రిల్లర్ లవ్ స్టోరీ. తెలుగు సినిమాల్లో రాని కథాంశంతో వస్తున్న చిత్రమిది. ఈ చిత్రకథను దర్శకుడు చాలా బాగా తెరకెక్కిస్తున్నారు' అని నిర్మాతలు తెలిపారు.