Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువన్ శంకర్ రాజా నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం 'ప్యార్ ప్రేమ కాదల్'. ఎలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్, రైజ విల్సన్ జంటగా నటించారు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ పతాకంపై యువన్ శంకర్ రాజా, విజరు మోర్వనేని సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ని సోమవారం చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'యువన్ శంకర్ రాజా నా ఫేవరేట్ సంగీత దర్శకుడు. 80లో ఎన్నో హిట్స్ ఇచ్చిన ఇళయరాజా తనయుడు కావడం కూడా తనంటే ఇష్టం ఏర్పడింది. ఆయన బిజీగా ఉన్నప్పటికీ నిర్మాతగా మారాడంటే సినిమాలో కంటెంట్ ఉండబట్టే అనుకుంటున్నా. టీజర్ చాలా బాగుంది. చక్కని యూత్ఫుల్ సినిమా అని అర్థమవుతుంది. నిర్మాత విజరు నాకు సోదర సమానుడు. అలాగే యువ ప్రతిభ పరిశ్రమకు రావాలి. వారి సినిమాల్ని ప్రోత్సహించడం నా బాధ్యతగా భావిస్తున్నా. ఏ భాషలో సినిమా అయినా బాగుంటే మన తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు. అలా తమిళంలో విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'చిరంజీవితో నలభై ఏండ్ల అనుబంధం ఉంది. నాన్నపై కోపంతో చిరుకి ఫోన్ చేసి మనం సినిమా తీయాలని 'మొగుడు కావాలి' తీశా. ఆ తర్వాత మరో సినిమా తీసినా వాటికిగాను చిరుకి పారితోషికం కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత మేం సినిమాల పరంగా దూరమయ్యాం. దర్శకుడిగా మారి 'అలజడి' సినిమా తీసినప్పుడు పిలవకుండానే వచ్చి సక్సెస్ పార్టీ ఇచ్చారు. ఆ రోజు చిరంజీవి వేరు, ఇప్పుడు చిరంజీవి వేరు. ఇప్పుడు కూడా మరోసారి ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరించారు. యువన్ శంకర్ రాజా నిర్మాతగా మారి తెరకెక్కించిన ఈ సినిమా నచ్చి తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. సినిమాలో 12 పాటలుంటాయి. యంగ్ టీమ్ అద్భుతంగా తీసింది' అని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. యువన్ శంకర్ రాజా చెబుతూ, 'మెగాస్టార్ ఆశీస్సులతో ఈ సినిమా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఆదరించాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. 'కాలేజ్ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ప్రేమలోని భావోద్వేగాలు ప్రేక్షకుల్ని సమ్మోహితులను చేస్తాయి. మంచి కంటెంట్ ఉన్న చిత్రమిది. తెలుగు ఆడియెన్స్ను కనువిందు చేసేందుకు అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం' అని దర్శక, నిర్మాత తెలిపారు.