Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు' అని అన్నారు రష్మిక మందన్నా. హీరోయిన్ రష్మిక, ప్రముఖ కన్నడ నటుడు రక్షిత్లు కొంతకాలంగా ప్రేమించుకుని నిశ్చితార్థం కూడా చేసుకున్న విషయం విదితమే. కొన్ని కారణాల వల్ల వీరి ఎంగేజ్మెంట్ రద్దు అయినట్టు రష్మిక తల్లి వెల్లడించారు. దీనిపై రష్మిక తల్లి సుమన్, నటుడు రక్షిత్ క్లారిటీ ఇచ్చారు. అయినా తనపై వస్తున్న వార్తలపై ట్విట్టర్ వేదికగా రష్మిక ఘాటుగా స్పందించారు. 'ఇంత కాలం నా వ్యక్తిగత విషయాల్లో నేను మౌనం వహించినందుకు నన్ను క్షమించండి. నా గురించి ఎన్నో కథలు, వార్తలు, కామెంట్లు వస్తున్నాయి. అవన్నీ నన్ను తప్పుగా చూపిస్తుండటంతో నేను డిస్టర్బ్ అవుతున్నా. ఈ విషయాలన్నీ చాలా దూరం వెళ్ళిపోయాయి. ఇందుకు మిమ్మల్ని వేలెత్తి చూపాలనుకోవడం లేదు. ఎందుకంటే మీరు అలాంటివే నమ్ముతారు. ఈ వార్తల గురించి మీ అందరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ మీ అందరికీ ఒక్కటే చెప్పాలనుకున్నా. రక్షిత్, నేనే కాదు, సినీ పరిశ్రమకు చెందిన ఏ ఒక్కరూ మాలాగా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోకూడదు. ఒక నాణేనికి రెండు ముఖాలు ఉన్నట్టు ప్రతి కథకు రెండు రూపాలుంటాయి. కాబట్టి దయజేసి మా పనిని ప్రశాంతంగా చేసుకోనివ్వండి. నేను కన్నడ సినిమాలు చేస్తూనే ఉంటాను. భాష ఏదైనా నేను చిత్ర పరిశ్రమలోనే ఉంటా' అని రష్మిక వెల్లడించారు. ఇటీవల 'గీత గోవిందం' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్న రష్మిక ప్రస్తుతం 'దేవదాస్', 'డియర్ కామ్రేడ్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 'దేవదాస్' ఈ నెల 27న విడుదల కానుంది.