Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమా రంగంలో లైంగిక వేధింపుల అంశం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖులు తీసుకుంటున్న నిర్ణయాలతో పలు సినిమాలు అగిపోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. తాజాగా అమిర్ ఖాన్ తాను నిర్మించబోతున్న గుల్షన్ కుమార్ బయోపిక్ నుంచి తప్పుకుంటున్న వెల్లడించారు. టీ సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ పేరుతో సినిమాను రూపొందిస్తున్నారు. సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు. తనను దర్శకుడు సుభాష్ కపూర్ లైంగికంగా వేధించాడని, ఓ పార్టీలో తనతో అనుచితంగా ప్రవర్తించాడని నటి గీతిక 2014లో కేసు పెట్టింది. తాజాగా 'మీ టూ' ఉద్యమం ఊపందుకోవడంతో మరోసారి ఈ వివాదం బయటకు వచ్చింది. దీంతో ఆయన దర్శకత్వం వహించబోతున్న బయోపిక్ నిర్మాణ బాధ్యతల నుంచి అమీర్ తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
'లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తనను అమిర్ ప్రొడక్షన్ సహించదు. గత రెండు వారాలుగా 'మీ టూ' ఉద్యమం ఉధృతమవుతోంది. ఓ వ్యక్తితో కలిసి సినిమాను నిర్మించాలను కున్నాం. కానీ ఆ వ్యక్తి గురించి ఇప్పుడు తెలిసింది. దోషులెవరో న్యాయస్థానమే నిర్ణయిస్తుంది. ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నా. సుభాష్ కపూర్పై కేసు ఇంత ఆలస్యంగా బయటకు రావడం ఆశ్చర్యంగా ఉంది' అని పేర్కొన్నారు. అలాగే బాలీవుడ్ బిగ్బీ ఎట్టకేలకు స్పందించారు. 'పని చేసే ప్రదేశాల్లో మహిళల పట్ల ఏ ఒక్కరూ దురుసుగా, అసభ్యంగా వ్యవరించకూడదు. అలాంటి ఘటనలు ఎదురైతే తక్షణమే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలి. నిందితులపై ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయపరమైన చర్యల ద్వారా పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టాలి. సమాజంలో మహిళలు, చిన్నారులు, అణగారిన వర్గాల వారు అణచివేతకు గురవుతున్న క్రమంలో పాఠశాల స్థాయి నుంచే నైతిక ప్రవర్తనపై అవగాహన కల్పించాలి. అన్ని రంగాల్లోని మహిళలకు భద్రత కల్పించాలి' అని అమితాబ్ చెప్పారు.
కథానాయిక కాజల్ స్పందిస్తూ, 'మహిళల్ని హింసించే రాక్షసుల గురించి నోరు విప్పి చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి. తాము ఎదుర్కొన్న సమస్యల గురించి బయటపెడుతూ తమకు తామే మద్దతు తెలుపుకుంటున్న మహిళలను నేను ప్రోత్సహిస్తున్నా. మనం ఒకరికొకరం సహకరించుకోవాలి. కష్టకాలంలో తోడుగా, నిజాయితీగా నిలవాలి. తమ పబ్లిసిటీ కోసం వేధింపుల అంశాలను బయటపెడుతున్నారని అనే వారికి నేను ఒక్కటే చెప్పాలనుకున్నా. వారిని తక్కువ చేసి చూస్తూ ఇంకా బురద చల్లకుండా చూడండి' అని కాజల్ అన్నారు. 'ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన సమయం వచ్చింది. తమ ఇబ్బందులను ధైర్యంగా పంచుకోవాలి' అని పరిణీతి చోప్రా తెలిపింది.
'అడ్జెస్ట్మెంట్కు నో చెప్పడంతో నేను మూడు అవకాశాలు కోల్పోయాను. వారసుల కంటే సినీ నేపథ్యం లేని వారిని అవకాశాల కోసం పడక గది వేధింపులకు అధికంగా గురవుతున్నారని నేను చెప్పలేను. కొత్తగా ఈ రంగానికి వచ్చేవారు లక్ష్యం దిశగా ముందుకెళ్ళడం కష్టమే. అడ్జెస్ట్ కాకపోవడం వల్ల ఛాన్స్లు తగ్గుతున్నాయి. నాకు గౌరవ మర్యాదలే ముఖ్యం. అందుకు అవకాశాలు పోయినా ఫర్వాలేదు. మహిళలకు సినిమా రంగంలోనే కాదు, ఇతర రంగాల్లోనూ భద్రత లేదు. పురుషాధిక్య సమాజంలో స్త్రీలు ఎదగడం కష్టమే' అని అదితిరావు హైదరీ పేర్కొంది. మరోవైపు సంగీత దర్శకుడు గోపీసుందర్పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. ఓ సింగర్ ఈ విషయాన్ని వెల్లడించింది. 'బాబుమోషాయి బందూక్బాజ్' చిత్ర టైమ్లో తనకు ఎదురైన వేధింపులపై నటి చిత్రాంగద సింగ్ మాట్లాడుతూ, 'ఆ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీతోపాటు వచ్చే కొన్ని సన్నివేశాలను మార్చమని దర్శకుడికి చెప్పాను. కానీ అతను నాతో అసభ్యంగా ప్రవర్తించారు. దుర్భాషలాడాడు. దీంతో నేను అక్కడ్నుంచి వెళ్ళిపోయా' అని తెలిపింది.
'నానాపటేకర్ అలాంటి వ్యక్తి కాదు. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు వాస్తవమే. తనుశ్రీ, నానా పటేకర్ విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఆయనతో కలిసి నేను చాలా కాలం పనిచేశాను. వ్యక్తిగతంగా పటేకర్ వేధించే వ్యక్తి కాదు' అని రామ్గోపాల్ వర్మ చెప్పారు.
'కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నార'ని సీనియర్ నటుడు ఆశ్రాని తెలిపారు. ఇదిలా ఉంటే లైంగిక వేధింపులపై ప్రొడ్యూసర్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ కమిటీకి స్నేహ రజనీ నాయకత్వం వహిస్తుండగా, అపూర్వ మెహతా, ఏక్తా కపూర్, ఫజిలా ఆల్లానా, కిరణ్ రావ్, జ్యోతి దేశ్పాండే, మధు బోజ్వాని, ప్రీతి షహాని, రోహన్ సిప్పీ, సిద్ధార్థ్ రారు కపూర్, విజరు సింగ్ సభ్యులుగా ఉన్నారు.