Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్లో 'మీటూ' ఉద్యమం సరికొత్త మలుపులు తీసుకుం టోంది. పలు ఆసక్తికర పేర్లు బయటకు వస్తూ మరింత హీట్ను పెంచుతుంది. తాజాగా నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ పేరు బయటికి వచ్చింది. తన పట్ల సుశాంత్ అసభ్యకరంగా ప్రవర్తిం చాడని సంజన అనే నటి ఆరోపణలు చేశారు. సుశాంత్ నటిస్తున్న 'కిజీ ఔర్ మ్యనీ' చిత్రంలో సంజన నటిస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై సుశాంత్ స్పందిస్తూ, 'కొందరు కావాలని చేస్తున్న ఆరోపణలను ఎదుర్కొవడానికి నాకు నేను మద్దతు ఇచ్చుకోక తప్పదు. కొందరు 'మీ టూ' ఉద్యమాన్ని వ్యక్తిగత విషయాల కోసం వాడుకుంటున్నారు. అందుకే నాకు, సంజనకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణను ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నాను. ఈ చాటింగ్ మొత్తం సినిమా చిత్రీకరణ మొదలైన రోజు నుంచి చివరి రోజు వరకు జరిపినది. ఇదిచూసి నిర్ణయం తీసుకోవాల్సిందే మీరే' అంటూ సంజనతో తాను చేసిన చాటింగ్ మెసేజ్లను స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు. 'సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' కార్యదర్శిగా ఉన్న సుశాంత్ సింగ్ తనపై వస్తున్న ఆరోపణలపై ప్రత్యేకంగా ఓ కమిటీ వేశారు. రవీనా టండన్, రేణుకా షహానె, దర్శకుడు అమొల్ గుప్తా నేతృత్వంలో వేసిన కమిటీ ఆయన కేసును విచారించనుంది.
ఇదిలా ఉంటే 'సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' కమిటీ విచారణకు నటుడు నానా పటేకర్ హాజరయ్యారు. అనంతరం తనపై తనుశ్రీ చేసిన ఆరోపణలపై మీడియాతో మాట్లాడుతూ, 'నాపై వచ్చిన ఆరోపణలు ఆధారాలు లేని, తప్పుడు అరోపణలు' అని అన్నారు. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా టైమ్లో నానా పటేకర్ తనను వేధించాడని తనుశ్రీ ఆరోపించిన విషయం విదితమే.
మీటూపై సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా మండి పడ్డారు. ఆయన మాట్లాడుతూ, 'నా 40 ఏండ్ల కెరీర్లో నేను ఏ మహిళతోనూ అసభ్యంగా ప్రవర్తించలేదు. ప్రతి మహిళను గౌరవిస్తూ వస్తున్నా. నా స్నేహితుడు సుభాష్ ఘారుపై లైంగిక ఆరోపణలున్నాయి. అలా అని ఆయనతో నేను కలిసి పనిచేయకుండా ఉండను. ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకులతో కలిసి పనిచేయకూడదని అనడం ఎంత వరకు సమంజసం. ఇప్పుడు 'మీటూ'ఉద్యమాన్ని అందరు ఉచితంగా వాడుకోవాలనుకుంటున్నారు' అని అన్నారు. నటి ఆండ్రియా 'మీ టూ'పై స్పందిస్తూ, 'కథానాయికలు అంగీకరించకుండానే మగవారు పడక గదికి పిలుస్తున్నారా? అన్ని ప్రశ్నించింది. 'మీటూ'పై నటి మధు స్పందిస్తూ, 'తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడమనేది మహిళా హక్కు. దానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ధైర్యంగా ముందుకు రావాలి' అని తెలిపారు. 'మీ టూ' ఉద్యమానికి నా పూర్తి మద్దతు ఉంటుందని అంటోంది రాధికా ఆప్టే. 'సమానత్వం, లింగభేదం లేని సమాజం రావాలి. అప్పుడు ఇలాంటి వేధింపులు ఉండవు. మా వరకు మేం పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ ఉండేలా చూసుకుంటున్నాం. సమాజంలో ఆ దిశగా మార్పు రావాలని కోరుకుంటున్నా' అని చెప్పింది.
ఫిల్మ్ మేకర్ మేఘనా గుల్జర్ 'మీటూ'పై స్పందిస్తూ, 'నేను ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొలేదు. కారణం నేనెప్పుడు నన్ను నేను తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నా. అంతేకాదు లౌకికంగా ఉండే ప్రదేశంలో, లింగ సమానత్వం ఉన్న ప్రదేశాల్లో పనిచేశాను. అందుకే అలాంటి వేధింపులు ఎదుర్కొలేదు. కాకపోతే కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు, స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాను' అని చెప్పారు. ఇదిలా ఉంటే దర్శకుడు విపుల్ షా తనను వేధించాడని బాలీవుడ్ నటి ఎల్నాజ్ నరౌజీ ఆరోపించారు. విపుల్ దర్శకత్వం వహించిన 'నమస్తే ఇంగ్లాండ్' విషయంలో తాను వేధింపులు ఎదుర్కొన్నానని తెలిపింది. 'ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు 'నేను ప్రపంచంలోనే అతి చెత్త నటి' అని ఫీల్ అయ్యేలా చేశాడు. తొలిసారి ఆడిషన్స్లోనే నన్ను ముద్దు పెట్టుకున్నాడు. మరోసారి అలా చేసేందుకు ప్రయత్నిస్తే ఆయన్ని పక్కకు తోసి నేను దేశం వదిలిపారిపాయా. తిరిగి వచ్చాక కూడా మూడు నెలలు టార్చర్ చేశాడు' అని తెలిపింది. ఇదిలా ఉంటే తనపై ఆరోపణలు చేసిన యాడ్ దర్శకురాలు లీనా మణిమేఘలపై మరో దర్శకుడు సుశీగణేశన్ పరువునష్టం దావా వేశారు. 'మణి మేఘల నా వద్ద సహాయదర్శకురాలిగానూ, రచయితగానూ అవకాశాలు కోరింది. తనకి ఛాన్స్లు ఇప్పించలేకపోవడంతో ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. సుశీగణేశన్ ఫిర్యాదును సైదాపేట మెట్రోపాలిటన్ కోర్టు విచారణకు స్వీకరించింది.