Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రతి నటికి విలక్షణమైన పాత్రలు పోషించాలని ఉంటుంది. అలాగే నేనూ అలాంటి విభిన్న పాత్రల కోసం చూస్తున్నా. వచ్చిన పాత్రల్లో బెస్ట్ చేస్తున్నా' అని అంటోంది అనుపమా పరమేశ్వరన్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రామ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 'హలో గురు ప్రేమ కోసమే'. విజయదశమి సందర్భంగా సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం అనుపమా పరమేశ్వరన్ మీడియాతో మాట్లాడుతూ, 'సినిమాకు, నా పాత్రకు మంచి స్పందన లభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 'తేజ్', 'కృష్ణార్జున యుద్ధం', 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రాలు ఆశించిన ఫలితాన్నివ్వలేకపోయినా నా పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి. పాత్ర పరంగా నా బెస్ట్ నేను ఇస్తాను. వర్సెటైల్ పాత్రలు చేయాలని ఉంది. సినిమాలో టీజ్ చేసే సన్నివేశం ఉంటుంది. రియల్ లైఫ్లో అలా టీజ్ చేయడం కరెక్ట్ కాదు. అమ్మాయిలను అమ్మగానో, చెల్లిగానో ప్రతి ఒక్క అబ్బాయి అనుకోవాలి. మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళకి ఇలా జరిగితే ఏంటని ఆలోచించాలి. అలాగే ఇటీవల 'మీటూ' ఉద్యమం బాగా చర్చనీయాంశంగా మారింది. ఇది మంచి పరిణామం. వేధింపులకు గురైనవాళ్ళు ధైర్యంగా తమ ఆవేదనని తెలియజేయటం అభినందనీయం. ఇలా చేయడం వల్ల చాలా మందిలో దీనిపై అవగాహన వస్తుంది. ధైర్యంగా ముందుకు వస్తారు. నాకు మాత్రం ఇలాంటి సంఘటనలు ఎదురుకాలేదు. ప్రస్తుతం తెలుగులో కొన్ని ప్రాజెక్ట్లకు చర్చలు జరుగుతున్నాయి. కన్నడలో 'నట సార్వభౌమ' సినిమా చేస్తున్నా. ఇందులో నాది స్ట్రాంగ్ లాయర్ పాత్ర' అని తెలిపారు.