Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మీటూ' దేశ వ్యాప్తంగా మరింత ఉధృతమవుతున్న నేపథ్యంలో తాజాగా రజనీకాంత్ దీనిపై స్పందించారు. 'మీటూ' ఉద్యమానికి మద్దతు తెలిపారు. 'మీటూ ఉద్యమం చాలా గొప్పది. మహిళలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించు కోవాలి. దుర్వినియోగం చేయకూడదు' అని అన్నారు. వైరముత్తుపై వస్తున్న ఆరోపణలపై రజనీ స్పందిస్తూ, 'వైరముత్తు తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండిస్తున్నారు. ఇలాంటి ఘటనలేమీ జరగలేదని అంటూ చట్టపరంగా చర్యలు తీసుకుంటానన్నారు' అని రజనీ పేర్కొన్నారు. తాజాగా వైరముత్తుపై మరో మహిళ ఆరోపణలు చేశారు. 'రైటర్ వైరముత్తు అంత మంచి వాడేం కాదు' అని ఆమె తెలిపారు.
'మీటూ' ప్రభావంతో పలు సినిమాలు ఆగిపోవడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఆయా ప్రాజెక్ట్ల నుంచి తొలగించడం చేస్తున్నారు. ఆ ప్రభావం ఇప్పుడు మలయాళ నటుడు దిలీప్పై పడింది. ఓ నటిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆరోపణలు దిలీప్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గతంలో ఇది దక్షిణాదిలో సంచలనం సృష్టించింది. తాజాగా దిలీప్ను అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ) తొలగించింది. ఆయన ఇచ్చిన రాజీనామా లెటర్కు ఆమోదం తెలిపినట్టు 'అమ్మ' అధ్యక్షుడు మోహన్లాల్ స్పష్టం చేశారు.
'చాలా రోజులుగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. దీనికి స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకోవాల్సిన టైమ్ వచ్చింది. అందుకోసం దిలీప్ను పిలిచి, నా నిర్ణయం చెప్పాను. 'అమ్మ'లో తన సభ్యత్వానికి రాజీనామా చేయమని అడిగా. ఆయన సంతకం చేసిన రాజీనామా లెటర్ను పంపారు. నేను ఆమోదం తెలిపాను. కానీ ఈ వివాదంలో అనవసరంగా నన్ను విమర్శిస్తున్నారు' అని మోహన్లాల్ తెలిపారు.
ఇక మీటూ ఉద్యమం బాలీవుడ్లో విభిన్న మలుపులు తిరుగుతుంది. చాలా మంది సపోర్ట్ చేయడంతోపాటు, పలువురు విమర్శిస్తున్నారు. అదే సమయంలో రోజు రోజుకు బాధితులు ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని చెబుతున్నారు. తాజాగా దీనిపై స్పందించేందుకు ఐశ్వర్యరారు నిరాకరించారు.
'ఈ ఉద్యమంపై ఓ ఈవెంట్లాగా స్పందించడం, మాట్లాడటం బాగోదు. కానీ ఈ విషయంలో నేను గర్వపడుతున్నా. దేశవ్యాప్తంగా ఓ ఉద్యమంలా మారడం మంచి పరిణామం' అని తెలిపారు. బాలీవుడ్లో బడా క్యాస్టింగ్ డైరెక్టర్గా పనిచేసిన ముఖేష్ చాబ్రాపై లైంగిక ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. ఆయన దర్శకుడిగా మారి రూపొందించబోతున్న 'కిజీ ఔర్ మ్యానీ' సినిమా నుంచి తొలగిస్తున్నట్టు నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియో వెల్లడించింది. రిలయన్స్ ఇండిస్టీస్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా హెడ్ అజిత్ ఠాకూర్ తనపై వచ్చిన ఆరోపణలకుగానూ తన పదవికి రాజీనామా చేశారు.
అసభ్యంగా ప్రవర్తించాడు..
అర్జున్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి శృతి హరిహరణ్ ఆరోపించారు. అర్జున్, శృతి 'కురుక్షేత్రం'లో కలిసి నటించారు.
ఈ టైమ్లో జరిగిన సంఘటనలను ఆమె 'మీటూ' ద్వారా పంచుకుంటూ, 'మౌనం వీడాల్సిన సమయం ఇది. చిన్నప్పట్నుంచి అనేకసార్లు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా. నటిగా కెరీర్ ప్రారంభించినప్పుడు చాలా నేర్చుకోవాలనే ఉత్సాహంతో వచ్చా.
కానీ ఇవాళ నేను ఉన్న పరిశ్రమపై విరక్తితో దీన్ని రాస్తున్నా. పరిశ్రమ
నా కలలు నిజం కావడానికి, నా ప్రతిభను పెంచుకోవడానికి, స్ఫూర్తిని కలిగించింది. అదే సమయంలో చాలా సందర్భాల్లో భయపడ్డాను, బాధపడ్డాను. 2016లో జరిగిన ఓ సంఘటన నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
అర్జున్తో ద్విభాషా చిత్రంలో నటిస్తున్నప్పుడు ప్రారంభంలో ఆయన సాధారణంగానే ఉండేవారు. సినిమాలో నేను ఆయన భార్య పాత్ర పోషించా. రొమాంటిక్ సన్నివేశంలో నటించే టైమ్లో అర్జున్ నా అనుమతి లేకుండానే నన్ను కౌగించుకున్నాడు. చేతులతో నా వెన్ను తడిమారు. నన్ను దగ్గరికి తీసుకుని ఇలా ప్రయత్నిద్దామా? అంటూ దర్శకుడిని అడిగారు. నేను షాక్ అయ్యా. సినిమాలో సహజత్వం ఉండాలి.
కానీ ఇలా చేయడం తప్పు. ఆ సమయంలో కోపం వచ్చినప్పటికీ మౌనంగా వెళ్ళిపోయాను. తర్వాత రిహార్సల్కి రానని చెప్పా. దీని వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలనుకోలేదు. కానీ ఆయనకు దూరంగా ఉన్నా. నాలా చాలా మంది ఇబ్బంది పడి ఉంటారని
ఈ విషయం చెబుతున్నా. మహిళలు శక్తివంతంగా మారి, మాట్లాడాల్సిన సమయం ఇది' అని ఆవేదన వ్యక్తం చేశారు.