Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్..తెలుగు చిత్ర పరిశ్రమ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన హీరో. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని అనతి కాలంలోనే తనదైన మేనరిజంతో ప్రేక్షకుల్ని ఫిదా చేశారు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే 'డార్లింగ్'గా అటు మహిళా ప్రేక్షకులకు, ఇటు యూత్కి బాగా దగ్గరయ్యారు. టాలీవుడ్ను 'బాహుబలి'కి ముందు, 'బాహుబలి' తర్వాత అనేలా చేసి సరికొత్త రికార్డులు సృష్టించి దట్ ఈజ్ డార్లింగ్ ప్రభాస్ అనిపించుకున్నారు. ప్రస్తుతం 'సాహో'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ పుట్టిన రోజు నేడు (మంగళవారం).
ఆరడుగుల ఆజానుబాహుడిగా, రెబల్స్టార్ కృష్ణంరాజు నటవారసుడుగా పరిచయమైన ప్రభాస్ తొలి సినిమా 'ఈశ్వర్'తోనే అందరి దృష్టిని ఆకర్షించారు. 'వర్షం' విజయంతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వరుసగా 'అడవిరాముడు', 'చక్రం', 'ఛత్రపతి', 'పౌర్ణమి', 'యోగి', 'మున్నా' 'బుజ్జిగాడు' 'బిల్లా', 'ఏక్నిరంజన్', 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'రెబల్', 'మిర్చి' వంటి విభిన్నమైన చిత్రాలు చేసి అన్నివర్గాల ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే 2015లో 'బాహుబలి ది బిగినింగ్', 2017లో విడుదలైన 'బాహుబలి 2'తో అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. జాతీయ స్థాయి నటుడిగా ఎదగడంతో పాటు, అనేకమంది అభిమానుల్ని, ప్రశంసల్ని సంపాదించారు. భారతీయ చలన చిత్ర చరిత్రలో దేశీయంగా అత్యధిక వసూళ్ళు సాధించిన 'బాహుబలి' చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ మైనపు ప్రతిమను 2017లో బ్యాంకాక్లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిష్టించారు. దీంతో ప్రపంచస్థాయి కళాకారుల సరసన చోటు సంపాదించిన ఈ మైనపు ప్రతిమ మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది.
షేడ్స్ ఆఫ్ సాహో..
ప్రస్తుతం ప్రభాస్ యువి క్రియేషన్స్ సంస్థ 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో 200 కోట్ల భారీ బడ్జెట్తో, హై టెక్నికల్ వ్యాల్యూస్తో తెరకెక్కుతున్న 'సాహో'లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మందిరా బేడి, ఎవ్లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్ వంటి బాలీవుడ్ తారలు నటిస్తుండటం విశేషం. ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం హాలీవుడ్ స్టంట్మాస్టర్స్తో పాటు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ శంకర్, ఎహసాన్, లారు పనిచేస్తున్నారు. తాజాగా ప్రభాస్ తన అభిమానులకు డబుల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. 'షేడ్స్ ఆఫ్ సాహో' పేరుతో ఈ సినిమా మేకింగ్ వీడియోను, ప్రభాస్ లుక్ను ఆయన పుట్టిన రోజు సందర్భంగా నేడు (మంగళవారం) విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక సోమవారం రిలీజ్ చేసిన 'సాహో' ప్రీ లుక్ సైతం సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. దీంతోపాటు 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో మరో పీరియాడిక్ లవ్ స్టోరీ చేస్తున్నారు. ఇటీవల ఇటలీలో చిత్రీకరణ ప్రారంభమైంది. యూరప్లో అత్యధిక భాగం షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి కూడా హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా కూడా తెలుగు, తమిళంతోపాటు హిందీలో తెరకెక్కుతోంది.