Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'శోభన్బాబు ఎంతటి క్రమ శిక్షణ కలిగిన నటుడో, ఆయన అభిమానులు కూడా అంతే సిన్సియారిటీని ఫాలో అవుతున్నారు. ఆయన పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టడం, అవార్డులు ప్రదానం చేయడం గొప్ప విషయం' అని ఎంపీ మురళీమోహన్ అన్నారు. శోభన్బాబు అభిమానులు 'శోభన్బాబు సేవా సమితి' పేరుతో తొలిసారి సినీ పురస్కారాలను అందించబోతున్నారు. ఈ నెల 25న భారీ ఎత్తున ఎన్కన్వెన్షన్లో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ, 'శోభన్బాబు గొప్ప వ్యక్తిగా, నిర్మాతలకు సహకరించిన హీరోగా పేరుతెచ్చుకున్నారు. ఆయనకు మంచి క్రేజ్ ఉన్నప్పుడే సినిమాల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత 'అతడు' సినిమాలోని ఓ పాత్ర కోసం కలిశాం. కానీ సున్నితంగా తిరస్కరించి, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు' అని అన్నారు. 'అభిమానులంతా కలిసి శోభన్బాబు పేరిట అవార్డుల కార్యక్రమం నిర్వహించడం నిజంగా ఆయనకు ఘనమైన నివాళి' అని పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు. పరుచూరి గోపాలకృష్ణ చెబుతూ, 'ఈ అవార్డుల కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు 19 అవార్డులను ఇస్తున్నాం. అందులో ఒకరికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 9 మందికి ఎవర్గీన్ అవార్డులు, 9ప్రామిసింగ్ అవార్డులున్నాయి. ప్రామిసింగ్ అవార్డుల్లో దర్శకుడు, హీరో, హీరోయిన్, నిర్మాత, రైటర్, సినిమాటోగ్రాఫర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, కమెడీయన్ ఉంటారు. ఈ అవార్డు వేడుకకు రెబల్ స్టార్ కృష్ణంరాజు అతిథిగా విచ్చేయనున్నారు' అని చెప్పారు. అభిల భారత శోభన్బాబు సేవాసమితి ప్రతినిధి ఎం.సుధాకర్బాబు చెబుతూ, 'ఈ ఫంక్షన్కి అండగా నిలిచిన రామాంజనేయులుకి థ్యాంక్స్. శోభన్బాబు అభిమానులుగా ఊపిరి ఉన్నంత వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటాం. జనవరి 14న కర్నూలులో శోభన్బాబు జయంతి వేడుకలు నిర్వహించబోతున్నాం' అని అన్నారు.