Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకే వ్యక్తి సినిమాకి సంబంధించిన 11 శాఖలను నిర్వహిస్తే అదొక అరుదైన ఫీట్. అలాంటి అరుదైన ఫీట్ను బండి సరోజ్ కుమార్ 'సూర్యాస్తమయం' సినిమా కోసం నిర్వర్తించి రికార్డు సృష్టించారు. స్టోరీ రైటర్గా, డైలాగ్ రైటర్గా, లిరిక్ రైటర్గా, ఎడిటర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, స్టంట్ మాస్టర్గా, ప్రొడక్షన్ డిజైనర్గా, సినిమాటోగ్రాఫర్గా, డైరెక్టర్గా వ్యవహరిస్తూనే తనే హీరోగా నటించారు. ఓజో మీడియా పతాకంపై రఘు పిల్లుట్ల, రవికుమార్ సుదర్శి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ, '2010లో తమిళంలో 'పోర్ కాలమ్' అనే సినిమా చేశా. చాలా మంచి స్పందన లభించింది. చాలా సహజసిద్ధమైన లొకేషన్లలో ఆర్టిస్టులకు ఎలాంటి మేకప్ ఉపయోగించకుండా నేచురల్గా ఈ 'సూర్యాస్తమయం' సినిమాను తెరకెక్కించాం. ఇది నేచురల్ యాక్షన్ చిత్రం. ఓ పోలీస్కి, గ్యాంగ్స్టర్కి మధ్య జరిగే అంతర్యుద్ధమే ఈ చిత్రం కథాంశం. పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నేను, గ్యాంగ్స్టర్గా త్రిశూల్ రుద్ర నటిస్తున్నాం. తమిళ నటుడు డేనియల్ బాలాజీ కీలక పాత్ర పోషిస్తున్నారు. హైదరాబాద్, వికారాబాద్, నల్గొండ, రామోజీ ఫిల్మ్ సిటీ, కడప, కర్నాటకలో చిత్రీకరణ జరిపాం. షూటింగ్తోపాటు పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు కూడా పూర్తయ్యాయి. ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. త్వరలోనే ట్రైలర్ని, అనంతరం సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. హిమాన్సీ కాట్రగడ్డ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కావ్యా సురేష్, మాస్టర్ అక్షిత్, మాస్టర్ చరణ్ సాయికిరణ్, బేబీ శర్వాణీ, మోహన్ సేనాపతి, వివేక్ ఠాకూర్, సాయి చంద్, కేకే బినోజీ, ప్రేమ్కుమార్ పాట్రా, షానీ, వంశీ పసలపూడి, శరత్కుమార్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.