Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అతిలోక సుందరి అనే టైటిల్కి శ్రీదేవి తప్ప మరెవ్వరు అర్హులు కాదు. ఆమెకది యాప్ట్' అని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు లెజెండరీ నటి శ్రీదేవిపై 'అతిలోక సుందరి శ్రీదేవి కథ' పేరుతో పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్లో జరిగింది. అతిథిగా విచ్చేసిన కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి కాపీని నిర్మాత దిల్రాజుకి అందించారు. మొదటి పుస్తకాన్ని రూ.20వేలకు నటుడు మాదాల రవి కొన్నారు. ఈ సందర్భంగా దిల్రాజు మాట్లాడుతూ, 'శ్రీదేవి 16ఏండ్ల వయసులో కథానాయికగా కెరీర్ని ప్రారంభించి అతిలోక సుందరిగా ఎదిగారు. రామారావు ఎంతో నిజాయితీగా ఈ పుస్తకాన్ని రాశారు. కానీ ఇప్పటి తరం అంతా కమర్షియల్ అయిపోయారు. పుస్తకాలు రాసే వాళ్ళు లేరు. ఈ సందర్భంగా రామారావుకి అభినందనలు తెలియజేస్తున్నా' అని అన్నారు. 'శ్రీదేవి భారతదేశంలోనే లేడీ సూపర్ స్టార్గా ఎదిగిన మొదటి కథానాయిక. ఆమె జీవితమే ఓ వేడుక. ఆమె నా ఫేవరేట్ నటి. ఆమె గురించి తర్వాత తరానికి చెప్పేందుకు ఈ పుస్తకం తీసుకొచ్చిన జర్నలిస్ట్ రామారావుకి ధన్యవాదాలు' అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ, 'శ్రీదేవి బాల నటి నుంచి అద్భుతమైన నటన, అందంతో ఆకాశమంత ఎత్తుకి ఎదిగారు. 'హిమత్వాలా' చిత్రంతో జాతీయ స్థాయి ఇమేజ్ని సొంతం చేసుకున్నారు.ఆమె మరణించినప్పుడు భారతదేశమే కాదు, ప్రపంచ సినీ లోకం కన్నీరు పెట్టుకుంది. జీవితంలో తప్పటడుగులు వేయొద్దని చెప్పి ఆమె వెళ్ళిపోయారు. ఓ సందర్భంలో నా సినిమా సెన్సార్ ఇబ్బందుల్లో ఉందని తెలిసి సహాయం చేశారు. కానీ ఇప్పటి సెన్సార్ వాళ్ళు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. నిర్మాతలని ఇబ్బందులు పెడుతున్నారు. దీన్ని చిత్రపరిశ్రమ మొత్తం ఖండించాలి' అని చెప్పారు. 'మరుగున పడుతున్న సినీ చరిత్రని తెలియజేసే ప్రయత్నం చేస్తున్న రామారావు నిజంగా గ్రేట్. ఆయనతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఒకప్పుడు ఆర్టిస్టులు, జర్నలిస్టులకు మంచి అనుబంధం ఉండేది. జర్నలిస్ట్లని గౌరవించేవారు. ఆ విషయం ఇప్పటి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు తెలుసుకోవాలి. రామారావు ఓ జర్నలిస్ట్గానే కాదు, రచయితగా ఎన్నో గొప్ప మాటలు, గొప్ప వ్యాఖ్యలు రాశారు. అవి నేటి తరానికి ఎంతో స్ఫూర్తినిస్తాయి. అతిలోక సుందరి నీవులేని వెండితెర ఎందుకమ్మా అన్న మాట నా హృదయాన్ని పిండేసింది. ఈ పుస్తకంలో ఎంతో బాహుకథ ఉంది' అని ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు. పుస్తక రచయిత పసుపులేని రామారావు మాట్లాడుతూ, 'శ్రీదేవి బాల నటిగా పరిచయం. ఆ పాప గురించి రాయమని వాళ్ళమ్మ ఎన్నోసార్లు అడిగారు. ఓ సారి మాదాల రంగారావు ఇచ్చిన వార్త రాస్తే అందులో దర్శకుడి పేరు మెన్షన్ చేయలేదు. దీంతో ఆ దర్శకుడి సెట్లోనే శ్రీదేవి ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. కానీ ఆ దర్శకుడు నన్ను బయటికి పొమ్మన్నాడు. ఆమె మాత్రం నన్ను పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ మధ్య హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎక్కడున్నా ఆమెని మర్చిపోలేం' అని చెప్పారు. 'రామారావు జర్నలిస్ట్ ఐకాన్. వామపక్ష భావాలున్న వ్యక్తి' అని మాదాల రవి చెప్పారు. ఈ కార్యక్రమంలో శివాజీ రాజా, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, అచ్చిరెడ్డి, బండారు సుబ్బారావు, ఏడిద శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.