Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠి జంటగా టీ.ఎన్. సంతోష్ దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పీ, ఔరా ఎంటర్టైన్మెంట్ ప్రై.లి పతాకంపై రాజ్ కుమార్ ఆకెళ్ళ, కావ్య వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం 'అర్జున్ సురవరం'. తాజాగా చిత్ర విడుదల తేదీని మార్చారు. ఈ సందర్బంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో హీరో నిఖిల్ సిద్ధార్థ్ మాట్లాడుతూ, 'మీడియా, స్టూడెంట్స్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో నేను రిపోర్టర్గా నటించాను. ఈ పాత్ర చేయడానికి ఫస్ట్ భయపడ్డాను. ఇది కత్తిమీద సాములాంటి పాత్ర. మీడియా పవర్ని కరెక్ట్గా చెప్పాలి. ఫోర్త్ ఎస్టేట్గా పిలవబడే మీడియా పవర్ని తెలియజేస్తూ, అందులోని చిన్న చిన్న లోపాలను ఎత్తి చూపాం. అదే సమయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని నటించాను. మీడియా వల్ల ప్రభుత్వాలు కూలిపోగలవు, ప్రభుత్వాలు ఏర్పడగలవు. అలాగే యుద్ధాలు క్రియేట్ చేయగలదు, ఆపగలదు. అంతటి మీడియాని చాలా స్ట్రాంగ్గా చూపిస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది. గతంలో పలు మార్లు వాయిదా పడ్డ 'కార్తికేయ' చిత్రం భారీ విజయం సాధించింది. ఇది కూడా దానిలాగే విజయం సాధిస్తుందనుకుంటున్నా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకుంది. ఇందులో 635 గ్రాఫిక్ షాట్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్ పాయింట్ని అంతే అద్బుతంగా దర్శకుడు సంతోష్ తెరకెక్కించారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా సినిమా ఉంటుంది. మేడే కానుకగా విడుదలవుతున్న మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'సినిమాని హిట్ చేయాలని కోరుకుంటున్నా' అని ఠాగూర్ మధు తెలిపారు. నిర్మాత రాజ్కుమార్ చెబుతూ, 'నిఖిల్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఎలక్షన్స్ వల్ల సినిమా కాస్త ఆలస్యంగా విడుదల చేస్తున్నాం. అన్ని వర్గాలని ఆకట్టుకునే చిత్రమిది' అని చెప్పారు.