Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో స్నేహా చిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తూ, నటించిన సినిమా 'మార్కెట్లో ప్రజాస్వామ్యం'. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక మంగళవారం జరిగింది. అతిథిగా విచ్చేసిన చిరంజీవి పాటల సీడీలని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, 'నారాయణ మూర్తి నన్ను ఎప్పుడూ పిలవలేదు. నన్ను పిలవాలన్న భావం రావడం చాలా ఆనందంగా అనిపించింది. 1978లో నేను 'ప్రాణం ఖరీదు' చేస్తున్నప్పుడు నూతన్ ప్రసాద్కి పేపర్ అందించే కుర్రాడిగా నటించారు. అప్పుడే తొలిసారి మేం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత పాండిబజార్లో అప్పుడప్పుడూ కలిసి మాట్లాడుకునేవాళ్లం. అప్పట్నుంచి మా పరిచయం కొనసాగుతోంది. నారాయణమూర్తిది ప్యూర్ హార్ట్. సినిమా అంటే ప్రేమ. ఈ రోజున ఆయన ఈ స్థాయికి రావడానికి కారణం ఆయన తన కష్టాన్ని నమ్ముకోవడమే. దీక్షతో, అలుపెరగకుండా పోరాడారు. ఆయన దీక్షా, పట్టుదల స్ఫూర్తివంతమైనవి. కమర్షియల్ వైపు మొగ్గుచూపకుండా, కమిట్మెంట్తో కమ్యూనిజం భావజాలంతో సినిమాలు చేస్తున్నారు. ఆయన అభ్యుదయవాది. ఎవరైనా కమర్షియల్ వైపు ఆకర్షితులవుతారు. కానీ 'టెంపర్' సినిమాలో నారాయణమూర్తికి పూరీ జగన్నాథ్ అవకాశం ఇచ్చినా సున్నితంగా తిరస్కరించారు. ఆర్.నారాయణమూర్తి ఆహార్యం కూడా నాకు చాలా ఇష్టం. అప్పుడు, ఇప్పుడు నారాయణమూర్తి ఒకేలా ఉన్నారు. మనిషి ఎంత ఎదిగినా, ఎంత సాధించినా సరే, ఆయన మానసికంగా మారలేదు. ఇలాంటి వ్యక్తులు సినిమా ఇండిస్టీలో వెతికినా దొరకరు. అలాంటి అరుదైన వ్యక్తి నారాయణమూర్తి. సినిమానే ఆయన పెళ్లి చేసుకున్నారు. సినిమాలతోనే ఆయన జీవిస్తున్నారు. 'మార్కెట్లో ప్రజాస్వామ్యం' ఆయనకు పెద్ద హిట్ కావాలి. అస్తవ్యస్తంగా మారుతున్న రాజకీయాలను ఎలా రక్షించుకోవాలన్న కాన్సెప్ట్తో తెరకెక్కించి ఉంటారని భావిస్తున్నా' అని అన్నారు. 'ఆర్.నారాయణమూర్తి ఫంక్షన్కి రావడం చాలా ఆనందంగా ఉంది. చిరంజీవిగారి సినిమాలను ఎంత ఆసక్తిగా చూసేవాడినో, ఆర్.నారాయణమూర్తి సినిమాలను కూడా అంతే ఇష్టపడేవాడిని' అని దర్శకుడు కొరటాల శివ చెప్పారు. ఆర్.నారాయణమూర్తి చెబుతూ, 'ఇటీవల చిరంజీవిగారిని కలిసి మా ఫంక్షన్కి రావాలన్నాను. 'నేను వస్తున్నాను' అన్నారు. సాటి నటుడిపై ఆయనకు ఉన్న అభిమానానికి నేను శిరస్సు వంచి దండం పెడుతున్నా. ఓ సినిమా షూటింగ్ టైమ్లో వాక్మన్ పెట్టుకుని ఓ యంగ్ చార్మ్ వస్తున్నాడు. ఎవర్రా బాబు అనుకున్నాను. తీరా చూస్తే చిరంజీవిగారు. బాస్ యు ఆర్ గోయింగ్ టు రూల్ తెలుగు ఇండిస్టీ అన్నాను. థ్యాంక్స్ నారాయణ అన్నారు. అన్నట్టే రూల్ చేస్తున్నారు. 'సైరా'తో ఆయన జన్మ ధన్యం చేసుకుంటున్నారు. ఇప్పుడు చిరంజీవి మెగాస్టార్.. 'సైరా' విడుదల తర్వాత ఒమెగా స్టార్ అవుతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం అనే అంశం ఆధారంగా తీసినదే నా 'మార్కెట్లో ప్రజాస్వామ్యం'. ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.