Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమీర్, శిరీష, అశ్విత హీరోహీరోయిన్లుగా రోశి రెడ్డి పందిళ్ళపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఇట్లు'. శ్రీజా ఆర్ట్స్ పతాకంపై రాజగౌడ్ పుదారీ, మెట్టయ్య వుప్పల, డా||రఘు, డా||శ్రీరాములు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురువారం ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నటుడు నారాయణరావు క్లాప్ నివ్వగా, శ్రీమతి వాణి (ఎం.ఎఫ్.టి .ఐ) కెమెరా స్విచాన్ చేశారు. మద్దూరి వెంకట కృష్ణమోహన్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రోశి రెడ్డి మాట్లాడుతూ, 'దర్శకుడిగా నాకిది తొలి చిత్రం. గతంలో రెండు మూడు షార్ట్ ఫిల్మ్స్ చేశా. గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఓ యువ రైతు అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొని జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఈ క్రమంలో అతని జీవితంలో ఓ భారీ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. అదేంటనేది ఆసక్తికరం. యాక్షన్, థ్రిల్లర్, రొమాన్స్, కామెడీ అంశాల మేళవింపుగా రూపొందిస్తున్నా. 'ఇట్లు' టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే' అని అన్నారు. 'నేను, కృష్ణ మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో ఫ్యాకల్టీగా పనిచేశాం. మా శిష్యుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది. కొత్తవారిని తెలుగు పరిశ్రమ, ప్రేక్షకులు ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. కొత్తగా వస్తున్న ఈ బృందాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా' అని నటుడు నారాయణరావు తెలిపారు. మద్దూరి వెంకట కృష్ణమోహన్ చెబుతూ, 'రోశి రెడ్డి తన స్నేహితుల సహకారంతో ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలి' అని చెప్పారు. 'మా బ్యానర్లో ఇది మొదటి చిత్రం. రోశి రెడ్డి ఈ కథని నెరేట్ చేసిన విధానం బాగా నచ్చి నిర్మించేందుకు ముందుకు వచ్చాం' అని నిర్మాత రాజగౌడ్ చెప్పారు. మరో నిర్మాత డా.రఘు మాట్లాడుతూ, 'సింగర్ అవ్వాలని డాక్టర్ అయ్యాను. ఈ సినిమాతో నిర్మాతనవ్వడం హ్యాపీగా ఉంది' అని చెప్పారు.