Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'దర్శకుడిగా నా సినిమా విషయంలో నేనెప్పుడూ సంతృప్తి చెందను. ఇంకాస్త బెటర్గా చేస్తే బాగుండూ అనిపిస్తుంది' అని అంటున్నారు దర్శకుడు తేజ. తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ని సొంతం చేసుకున్న తేజ తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా 'సీత' చిత్రాన్ని రూపొందించారు. ఈ శుక్రవారం విడుదలైన సినిమాకి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో శనివారం తేజ మీడియాతో మాట్లాడుతూ, 'విడుదలైన సినిమాకి ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. రివ్యూస్ నెగటివ్గా ఉన్నప్పటికీ ప్రేక్షకులు సినిమాని ఎంజారు చేస్తున్నారు. ఎలక్షన్ రిజల్ట్ ప్రభావంతో మార్నింగ్ షో స్పందన తక్కువగా ఉంది. ఈవినింగ్ నుంచి ఆడియెన్స్ పెరుగుతున్నారు. ఇప్పుడు థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. ఎవరి సినిమా వారికి బాగానే కనిపిస్తుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఆడియెన్స్ చెబుతారు. సినిమాని దర్శకుడు జడ్జ్ చేయలేడు. అలా చేయగలిగితే ఏ దర్శకుడు ఫ్లాప్ సినిమా తీయడు. ఇందులో సీత పాత్ర నేటి పరిస్థితులను ప్రతిభింబిస్తుంది. సమాజం ఎలా ఉందో చెబుతుంది. రామ్ పాత్ర ఎలా ఉండాలో చెబుతుంది. ఇప్పుడున్న మహిళలు చాలా స్ట్రాంగ్. చాలా ఫార్వర్డ్గా ఉన్నారు. సాధారణంగా చాలా మంది హీరోలు బాగా నటించగలరు. కానీ వారికి వారే ఓ గోడ కట్టేసుకుంటాడు. ఏ దర్శకుడు ఆ గోడని దాటి ముందుకెళ్ళి నటింపచేయలేడు. నేను అలా కాదు, ఆ గోడని బద్దలు కొట్టి నటింపచేస్తా. ముందుగా వారిని కథలో ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడే కడుపులోనుంచి నటిస్తారు. బెల్లంకొండ విషయంలో అదే చేశా. సినిమా ప్రారంభం టైమ్లోనే బౌండెడ్ స్క్రిప్ట్తో వెళతా. కేవలం కామెడీ సీన్లు మాత్రమే బెటర్ చేస్తాను. ఇక షూటింగ్లో యాక్టర్స్ని కొడతాననే కామెంట్ మంచిదే. అ భయం ఉంటేనే నిజమైన, సిన్సియర్ యాక్టర్స్ వస్తారు. నెక్ట్స్ ఇంకా ఏ సినిమా అనుకోలేదు. ఏదైనా ప్రస్తుత సినిమా ఫలితాన్ని బట్టి, ఆడియెన్స్ ఇచ్చే గిఫ్ట్ని బట్టి నెక్ట్స్ సినిమా ఉంటుంది. సినిమా బాగా ఆడితే పెద్ద హీరో వస్తాడు, యావరేజ్గా ఆడితే యావరేజ్ హీరో వస్తాడు. లేకపోతే కొత్త హీరోలతో చేయాలి. ఇటీవల సోషల్ మీడియాలో ప్రతిదీ వివాదమవుతుంది. చాలా మంది పనిలేని వాళ్ళు చేసే పని అది. భారతదేశంలో జనాభా ఎక్కువగా ఉండటం వల్ల అందరికి పనిలేదు. దీంతో ఇలాంటి పనులు చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఖాళీగా ఉండేవాళ్ళే సినిమాలు చూస్తారు. వాళ్ళే మాకు ఆదాయం. మరోవైపు తెలుగు ఇండిస్టీ రాంగ్ సైడ్ వెళ్తుంది. బడ్జెట్ ఉంది కదా అని అనవసరమైన హంగులకు పోతున్నారు. దీంతో కథ పక్కదారి పడుతుంది. కథకి,పాత్రకి ఏది అవసరమో అదే పెట్టాలి. ఇప్పుడున్న సీనియర్ దర్శకులు రాణించలేకపోతున్నారనే దానికి నేను కామెంట్ చేయను. ఎందుకంటే నాకంత బ్రెయిన్ లేదు. చాలా మంది సినిమా చూస్తూ అందులో తప్పులు వెతుకుతుంటారు. తీసేవాడి కంటే మనం గొప్ప అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా చేసే పని అది. నేను అలాంటి పనిచేయను. 'ఎన్టీఆర్' బయోపిక్ నుంచి తప్పుకున్నప్పుడు మంచి ప్రాజెక్ట్ని ఎందుకు వదులుకున్నావన్నారు. సినిమా విడుదలయ్యాక తప్పుకొని మంచి పని చేశావన్నారు(నవ్వుతూ)' అని అన్నారు.