Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఫలక్నుమా దాస్' సినిమాకి నిర్మాతల కోసం స్క్రిప్ట్ పట్టుకుని చాలా ఆఫీసుల చుట్టూ తిరిగా. గేట్ నుంచి బయటకు పంపించేశారు. కొందరు ఇదేం సినిమా అన్నారు. టీజర్ విడుదలయ్యాక నన్ను పొమ్మన్నవాళ్ళే సినిమా కొనటానికి ముందుకు వచ్చారు' అని అంటున్నారు విశ్వక్ సేన్. ఆయన హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో కరాటే రాజుతో కలిసి నిర్మించిన చిత్రం 'ఫలక్నుమా దాస్'. నేడు(శుక్రవారం) ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం విశ్వక్ సేన్ మీడియాతో మాట్లాడుతూ, 'నేను మొదట ఫిల్మ్ మేకింగ్ గురించి తెలుసుకున్నా. యానిమేషన్ కోర్స్ చేసి దర్శకుడిని అవ్వాలనుకున్నా. యాక్టింగ్ అంటే ఇష్టమే. నటన, దర్శకత్వం నాకు రెండు కళ్ళలాంటివి.
ఈ రెండింటిలోనూ ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటున్నా. గతంలో 'వెళ్ళిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది' సినిమాల్లో నటించాను. నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు. 'అంగమలై డైరీస్' అనే మళయాళ సినిమా చూశాక తెలుగులో మన నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేస్తే వర్కౌట్ అవుతుందనిపించింది. అక్కడితో పోలిస్తే మన హైదరాబాద్లో ఎన్నో రంగురంగుల ప్రదేశాలు, మంచి ఆర్కిటెక్చర్స్ ఉన్న ప్రాంతాలున్నాయి. అవన్నీ చూపించాలని కథని మనకు తగ్గట్టుగా మార్చాను.
టీజర్, ట్రైలర్ చూసి సినిమా అంతా గొడవలతో, గోలగోలగా ఉంటుందేమో అనుకుంటున్నారు.
కానీ ఇందులో ఒక కోర్ ఎమోషన్ ఉంటుంది. తల్లిదండ్రులు, సిస్టర్, ఫ్రెండ్ ఇలా అన్ని రకాల సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ అంతా అనుబంధాలతో సాగుతుంది. ఊహకందని విధంగా ఉంటుంది. ప్రతీ సీన్ ఆడియెన్స్ని థ్రిల్ చేస్తుంది. నటించడం, దర్శకత్వం వహించడం కంటే ప్రొడక్షన్ చూసుకోవడం కష్టంగా అనిపించింది. నిర్మాణంలోకి దిగాక తప్పదు కదా అనుకుంటూ ముందుకెళ్ళాను. తరుణ్ భాస్కర్ ఏ పాత్ర ఇచ్చినా చేయగలడు. ఇందులో ఎస్.ఐ బీ.టి.సైదులు పాత్రకు బాగా సూట్ అవుతాడనిపించి అడిగాను. అద్భుతంగా చేశాడు. ఒకప్పుడు సినిమా డైలాగ్స్ అంటే అచ్చ తెలుగులో ఉండాలని, మనం మాట్లాడే భాష కాకుండా పేపర్ భాష వాడాలని అంటుండే వాళ్ళు. నేను కూడా అలాగే ఆలోచించే వాణ్ణి. తరుణ్ భాస్కర్ చేసిన 'సైన్మా' షార్ట్ ఫిల్మ్ చూశాక నా ఆలోచన మార్చుకున్నాను. అప్పటి వరకు మబ్బుల్లో ఉన్నానేమో అనిపించింది. నాకు వచ్చిన భాషలో రాసుకుని తీశా. సినిమా మీద పూర్తి నమ్మకం ఉంది.
అసలు రెడీ అయిన వెంటనే అందరికీ చూపించేయాలనిపించింది. అందుకే ఒక రోజు ముందే ప్రీమియర్స్ ప్లాన్ చేశాం. ముందుగా పది థియేటర్స్ అనుకున్నాం. కానీ ఆ సంఖ్య ముప్పై దాటింది. ఈరోజు రాత్రికే సూపర్ హిట్ టాక్ వస్తుందని కాన్ఫిడెంట్గా ఉన్నా. ప్రస్తుతం హీరో నాని బ్యానర్లో శైలేష్ అనే నూతన దర్శకుడితో ఓ సినిమా, 'కార్టూన్'(వర్కింగ్ టైటిల్) అనే మరో సినిమా చేస్తున్నా. దీంతోపాటు మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. డైరెక్షన్కి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి నటనపై దృష్టి పెట్టాలనుకుంటున్నా' అని చెప్పారు.