Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల 'మహర్షి'తో మంచి విజయాన్ని అందుకున్న మహేష్బాబు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా ఎంపికైంది. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఎ.కె ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై దిల్రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'సరిలేరు నీకెవ్వరు' అనే టైటిల్ని ఖరారు. శుక్రవారం నటుడు కృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సినిమాని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి అతిథిగా విచ్చేసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ నివ్వగా, ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. కె.రాఘవేంద్రరావు, దిల్ రాజు సంయుక్తంగా స్క్రిప్ట్ను దర్శకుడు అనిల్ రావిపూడికి అందించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, 'నా జీవితంలో గుర్తుండిపోయే రోజు ఇది. ఇంత మంచి అవకాశం కల్పించిన సూపర్స్టార్ మహేష్ని ఎప్పటికీ మర్చిపోలేను. దీనితో కచ్చితంగా ఓ హిట్ సినిమాని అందించి ఆయన రుణం తీర్చుకుంటాను. ఈ సినిమాని మూడు నిర్మాణ సంస్థలు నిర్మించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రానికి మంచి నటీనటులు, ప్రతిభ గల సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఒకప్పుడు అగ్ర కథానాయికగా రాణించిన విజయశాంతిగారు దాదాపు 13ఏండ్ల తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సబ్జెక్ట్ నచ్చి సినిమాలో నటించేందుకు ఆమె ఒప్పుకోవడం ఆనందంగా ఉంది. ఇందులో మహేష్బాబు ఆర్మీ మేజర్ పాత్రని పోషిస్తున్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. 'భరత్ అనే నేను', 'మహర్షి' తర్వాత దేవిశ్రీప్రసాద్ మరోసారి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు ఆయనకు థ్యాంక్స్. మహేష్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. కచ్చితంగా అన్ని వర్గాలను ఎంటర్టైన్ చేసే చిత్రమవుతుంది' అని చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. అలాగే ప్రెస్మీట్కి రాలేని కారణంగా విజయశాంతి రాసిన లెటర్ని దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాకి చదివి వినిపించారు. 'నా తొలి చిత్రం 'కిలాడి కృష్ణుడు'. అందులో సూపర్స్టార్ కృష్ణ హీరో. తొలి సినిమానే ఆయనతో పనిచేసే అవకాశం లభించింది. 13ఏండ్ల తర్వాత మళ్ళీ కృష్ణ తనయుడు సూపర్స్టార్ మహేష్తో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది' అని విజయశాంతి లెటర్లో పేర్కొన్నారు.
నిర్మాత దిల్ రాజు చెబుతూ, 'సూపర్స్టార్ కృష్ణగారికి 77వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మా అనిల్ రావిపూడి డైరెక్షన్లో 'మహర్షి' తరువాత మళ్ళీ మూడు బేనర్లు నాది, అనిల్ సుంకర ఎ.కె ఎంటర్టైన్మెంట్స్, మహేష్ బాబుగారి జిఎంబి కలిసి నిర్మిస్తున్నాం. అనిల్ సంక్రాంతి 2020 అని ఆల్రెడీ రిలీజ్ డేట్ ప్రకటించేశారు. మనందరికీ తెలుసు 20-20 క్రికెట్ మ్యాచ్లు ఎలా ఉంటాయో. వచ్చే సంక్రాంతికి అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అనిల్ రెడీ అయ్యారు' అని తెలిపారు.
'సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా ఈ సినిమాని ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. దిల్ రాజు, అనిల్ రావిపూడి సహకారంతో మహేష్ అభిమానులకు, రెండు రాష్ట్రాల ప్రేక్షకులకు అదిరిపోయే రేంజ్లో సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేస్తున్నాం' అని మరో నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ, 'ఈ సినిమాలో పనిచేయడానికి ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్' అని చెప్పారు.
''మహర్షి' సక్సెస్ని ఎంజారు చేస్తూనే ఈ సినిమాలో అడుగుపెడుతుండటం సంతోషాన్నిస్తుంది. మా హీరోకి మంచి మాస్ సాంగ్ కావాలని చాలామంది మహేష్ ఫ్యాన్స్ అడుగుతున్నారు. అందరికీ ఈరోజు చెబుతున్నాను. పార్టీ అంటే ఖచ్చితంగా ఆ పాటే పెట్టేవిధంగా ఒక మాస్ సాంగ్, అలాగే ఈ పాట పెట్టకుండా లవ్ చేయొద్దు అనే లాంటి ఒక లవ్ సాంగ్ చేయాలని దర్శకుడు అనిల్, నేను నిర్ణయించుకున్నాం. ఈ సందర్భంగా మహేష్ అభిమానులకు ప్రామిస్ చేస్తున్నా' అని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జెమినీ కిరణ్, శిరీష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.